కుత్బుల్లాపూర్, మార్చి17: మేడ్చల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అధికారులు భారీ డ్రగ్స్ రాకెట్ను ఛేదించారు. రెండు వేర్వేరు కేసుల్లో దాదాపు రూ. 9 లక్షల విలువ చేసే కోకైన్, ఓజీ కుష్ (హైబ్రిడ్ గంజాయి)ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ షేక్ ఫయాజుద్దీన్ వెల్లడించారు. డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రవాణాకు ఉపయోగించిన కారును సీజ్ చేశారు.
రహస్య సమాచారం మేరకు సుచిత్ర సర్కిల్ వద్ద ఎక్సైజ్ పోలీసులు మంగళవారం రూట్ వాచ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇన్జోత్సింగ్ నాగ్పాల్ (27) అనే వ్యక్తి వద్ద 76.77 గ్రాముల కోకైన్ను గుర్తించారు. ముంబైలోని బోరివలి ప్రాంతంలో అబ్డుజ్ అనే వ్యక్తి నుంచి ఈ డ్రగ్స్ను కొనుగోలు చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. అనంతరం ఇన్జోత్సింగ్ నాగ్పాల్ను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు.

సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ ద్వారా ఓజీ కుష్ (హైబ్రిడ్ గంజాయి) విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో హస్మత్పేట్ ప్రాంతంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. మన్ప్రీత్ సింగ్ (35) అనే వ్యక్తి వద్ద 200 గ్రాముల ఓజీ కుష్ను స్వాధీనం చేసుకున్నారు. అతడికి తమిళనాడులోని పటియాల అనే వ్యక్తి సరఫరా చేసినట్లు మన్ప్రీత్ వెల్లడించాడు. నిందితుడిని బాలనగర్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు. ఈ ఆపరేషన్లో ఏఈఎస్ మాధవయ్య, డీటీఎఫ్ సీఐ నర్సిరెడ్డి, ఎస్సై పవన్ కుమార్ రెడ్డి, సిబ్బంది వెంకటేశ్వరరావు, చెన్నయ్య, శ్రీనివాస్, జ్యోతి, తేజ, మునాఫ్లు పాల్గొన్నారు.