Talasani | ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ సర్కారు స్పష్టత ఇవ్వాలని సనత్నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద శనివారం నియోజకవర్గ పరిధిలోని కార్పోరేటర్లు, మాజీ కార్పోరేటర్లు, బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 2 నుంచి నియోజకవర్గ పరిధిలోని బస్తీలు, కాలనీలలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు డివిజన్లలోని బస్తీలు, కాలనీలలో పర్యటించి చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు.
అదేవిధంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను తెలుసుకుంటామన్నారు. జనవరి 2న బన్సీలాల్పేట డివిజన్, 3న రాంగోపాల్పేట, 4న సనత్నగర్ డివిజన్లలో పర్యటించనున్నట్లు వివరించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు రూ.కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్తో చేపట్టిన పనుల్లో కొన్ని నిలిచిపోయాయని చెప్పారు. వాటిలో కొన్ని అభివృద్ధి పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, మిగతా పనులను త్వరలో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బస్తీలు, కాలనీల పర్యటనలో ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో స్పష్టం చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజల నుండి స్వీకరిస్తున్న దరఖాస్తుదారుల్లో అర్హులను ఎప్పటి లోగా ఎంపిక చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించాలన్నారు. అదేవిధంగా నూతనంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే విధంగా నిర్ధిష్టమైన దరఖాస్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు సరిపడా లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని చోట్ల కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దరఖాస్తుల కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నిర్వహించే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని తెలిపారు. ఆరు గ్యారెంటీల కోసం అర్హులైన వారు జనవరి 6లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరినందున అర్హులైన వారితో దరఖాస్తు చేయించాలని సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నేతలకు సూచించారు. బస్తీలు, కాలనీలలో ఇంటింటికి వెళ్ళి అర్హులైన వారికి దరఖాస్తులను అందించే విధంగా చూడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా అమలు చేయకుండా కాలయాపన చేయాలని చూస్తుందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీస్తారని అన్నారు.