ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్ : ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునే విధంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చర్యలు తీసుకున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహ్మత్నగర్లో బుధవారం ‘అక్షయపాత్ర’ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ మురికివాడల్లో నివసిస్తున్న పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించాలన్న ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. నగరంలోని లక్షలాది మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకునేలా అక్షయపాత్ర పోషిస్తున్న పాత్రను ఆయన ప్రశంసించారు. అనంతరం రక్షా కిట్లను బస్తీ వాసులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఒక్కో కిట్లో బియ్యం, పప్పు, వంటనూనె తదితర నిత్యావసర వస్తువులను పొందుపర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ నీలిమ, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, నేతలు మన్సూర్, సుబ్బరాజు, నాగకరాజు, షరీఫ్, శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.