సికింద్రాబాద్ : దివ్యాంగులకు సహకరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రభుత్వం సైతం వీరికి అన్ని విధాల సహకారం అందించేలా చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
బాలంరాయిలోని గురు గౌతం మునిజైన్ చారిటబుల్ కంటోన్మెంట్ ఆసుపత్రి ఆవరణలో బుధవారం దాదాపు 400 మంది దివ్యాంగులకు చక్రాల సైకిళ్లు, కృత్రిమ కాలు, ఇతర పరికరాలను భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత సమితి, జైన్ శ్రావక్ సంఘ్, శ్రీ ఆనంద్ యువమండల్, మహావీర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్, సికింద్రాబాద్ల ఆధ్వర్యంలో ఉచితంగా అందజేశారు.
దీనికి బోర్డు సీఈవో అజిత్రెడ్డితో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో 6లక్షల మందికి, దేశ వ్యాప్తంగా 17 కోట్ల మందికి చక్రాల సైకిళ్లు, కృత్తిమ కాలు, ఇతర పరికరాలు అందజేయడం అభినందనీయమన్నారు.
దీంతో పాటు జైపూర్ వంటి నగరాల్లో మొబైల్ సర్వీస్ సేవలు అందించడం వారి సేవా పనితీరుకు నిదర్శన మన్నారు. వారు కోరిన మేరకు సదరన్ రికార్డుల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూస్తామని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో డిసెబుల్డ్ వెల్ఫేర్ డైరక్టర్ శైలజ, కార్యదర్శి దివ్య, ఆయా సంస్థల ప్రతినిధులు ఎల్ఎన్ శర్మ, గౌతంజైన్, కఠారియా, సురానా, లక్ష్మినారాయణ, వాసుదేవారెడ్డిలతో పాటు బోర్డు అధికారులు బాలకృష్ణ, గోపాలకృష్ణ దాస్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.