ఖైరతాబాద్, మార్చి 11 : విధి వక్రీకరించి మృత్యువు కబళించినా.. అవయవదానం ద్వారా వారు జీవించారు. కరీంనగర్ బోయినపల్లెకు చెందిన గంగాధర అంజయ్య (49) రాజన్న-సిరిసిల్ల జిల్లాలో ఏఆర్ హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఈ నెల 2న బైకుపై విధులకు వెళ్తుండగా, వాహనం అదుపుతప్పి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద దవాఖానలో చేర్పించారు.
చికిత్స అందిస్తున్న వైద్యులు 10న బ్రెయిన్ డెడ్కు గురైనట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులను కలిసిన జీవన్దాన్ ప్రతినిధులు అవయవదానం విశిష్టతను వివరించగా, అందుకు అంగీకరించారు. ఆయన శరీరం నుంచి కాలేయం, రెండు మూత్ర పిండాలు, నేత్రాలను సేకరించారు. మరో ఘటనలో నల్గొండ జిల్లా కాకులకొండారంలోని డోనకల్ ప్రాంతానికి చెందిన యాస చిత్తరంజన్ రెడ్డి (28) డ్రైవర్గా పనిచేశారు.
ఈ నెల 5న తీవ్రమైన తలనొప్పితో అపస్మారక స్థితిలో పడిపోగా, కుటుంబ సభ్యులు మలక్పేటలోని యశోద దవాఖానలో చేర్పించారు. చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 9న బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. జీవన్దాన్ చొరవతో అవయవదానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. ఆయన శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, ఒక ఊపిరితిత్తిని సేకరించారు. అవయవదానికి సహకరించిన కుటుంబ సభ్యులను జీవన్దాన్ అభినందించింది.