సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటుందో.. అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. కొత్త కంపెనీలు ఏర్పడటం, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ శాఖకు అధిక ప్రాధాన్యతనిచ్చి శాంతి భద్రతల పరిరక్షణ, నేర నివారణకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడంలో పెద్దపీట వేశారని తెలిపారు. దీంతో కమిషనరేట్లోని హోంగార్డు నుంచి కమిషనర్ వరకు కష్టపడి ఈ ఏడాది 12 శాతం నేరాలను తగ్గించామని సీపీ వెల్లడించారు. సాధారణ నేరాలు తగ్గినా, సైబర్ నేరాలు మాత్రం 25 శాతం పెరిగాయని తెలిపారు. శుక్రవారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2022 వార్షిక నివేదకను ఆయన కమిషనరేట్లో పనిచేసే ఉన్నతాధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీసులు ప్రజలతో మమేకమై నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ ఈ ఏడాది విజయం సాధించారన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ ఐటీ, హెల్త్, ఫైనాన్షియల్, ఫార్మా సెక్టార్ హబ్గా నిలుస్తుందన్నారు. అన్ని విభాగాల్లోని సిబ్బంది కష్టపడి పనిచేయడంతో ప్రాపర్టీ అఫెన్సెస్లో 28 శాతం తగ్గుదల ఉందని, గడిచిన పదేండ్ల కాలంలో ఇది రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇలాంటి ఫలితం సాధించిన ఘనత సైబరాబాద్ కమిషనరేట్దేనని అన్నారు. ఈ ఏడాది టీఆర్ఎస్ ప్లీనర్, ముచ్చింతలలో 15 రోజుల పాటు సమాతమూర్తి విగ్రహా ఆవిష్కరణ, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, రాహుల్ గాంధీ జోడో యాత్రలు జరిగాయని, అన్ని కార్యక్రమాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, చిన్న ఘటనకు కూడా తావులేకుండా విజయవంతం చేశామన్నారు. విజిబుల్ పోలీసింగ్ పెరగడంతో ఈ ఏడాది 2,91,632 ఈ పెట్టీ కేసులు నమోదయ్యాయన్నారు. పాయింట్ బుక్స్ను 29,18,344 సార్లు విజిటింగ్ చేశారన్నారు. డయల్ 100కు గత ఏడాది 1,57,956 కాల్స్ రాగా, ఈ ఏడాది 2,36,417 కాల్స్ వచ్చాయని, 49 శాతం కాల్స్ పెరిగాయన్నారు. గత ఏడాది 30,954 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 27,322 కేసులు నమోదయ్యాయని, కేసుల నమోదులో 12 శాతం తగ్గుదల ఉన్నదని సీపీ వివరించారు.
మహిళలు, పిల్లల భద్రతకు ప్రాధాన్యం
మహిళలు, పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని అధికారులు వెల్లడించారు. పోక్సో కేసులు 2021లో 368 నమోదు కాగా, 2022లో 260 నమోదయ్యాయన్నారు. ఈ సందర్భంగా మాదాపూర్, శంషాబాద్, బాలానగర్, షీ టీమ్స్, ట్రాఫిక్ డీసీపీలు శిల్పవల్లి, జగదీశ్రెడ్డి, సందీప్, కవిత, శ్రీనివాస్రావు తదితర అధికారులు ఆయా జోన్లలో ఈ ఏడాది సాధించిన విజయాల గూర్చి వివరించారు. వరకట్నపు హత్యలు, ఆత్మహత్యలు, వరకట్న వేధింపులు, మహిళల హత్యలు, కిడ్నాప్లు, వేధింపులు తదితర నేరాలు చాలా వరకు తగ్గాయన్నారు. ఈ ఏడాది వివిధ కేసుల్లో 1029 మందిని డెకాయి ఆపరేషన్ ద్వారా షీ టీమ్స్ పట్టుకున్నదని, 1306 పెట్టీ కేసులు నమోదు చేయగా, 82 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు.
సైబర్ నేరాల్లో పెరుగుదల..
ఈ ఏడాది సైబర్ నేరాలు పెరిగాయని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సంగన్వర్ వెల్లడించారు. సైబర్ నేరాల ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్స్. జీవోవి. ఇన్, 1930 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. సైబర్ నేరాలపై వస్తున్న ఫిర్యాదులపై కేసులు నమోదు చేస్తున్నామని, నేరస్తులు ఎక్కడున్నా వారిని పట్టుకొచ్చేందుకు సైబర్ పోలీస్ బృందాలు ఆయా రాష్ర్టాలకు వెళ్తున్నాయన్నారు. సైబర్నేరాలను అదుపు చేసేందుకు సైబరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ విభాగం ప్రారంభమయ్యిందని, దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మున్ముందు సైబర్నేరాలను అదుపు చేసేందుకు వీలు ఉంటుందన్నారు. సైబర్నేరాలను ఆర్థికపరమైన నేరాలు, సోషల్ క్రైమ్, ఇండస్ట్రీస్కు సంబంధించిన క్రైమ్గా విభజించామన్నారు. ఇండస్ట్రీలో సైబర్ సేఫ్టీ ఉండాలని, వారికి కావాల్సిన సహకారాన్ని అందిస్తున్నామన్నారు. సైబర్నేరాలను దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక టూల్స్ తయారు చేశామన్నారు. గత ఏడాది 3854 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 4850 సైబర్ నేరాలు నమోదయ్యాయని, 25 శాతం కేసులు పెరిగాయన్నారు.
టెక్నాలజీతో బందోబస్తు
సైబరాబాద్లో టెక్నాలజీని వాడుతూ వివిధ బందోబస్తులను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. వినాయక ఉత్సవాల బందోబస్తుకు సైబరాబాద్లో మొదటి సారి డ్రోన్ కెమెరాలు వాడామని సీపీ తెలిపారు. అవసరాలను బట్టి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసి, స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తామన్నారు. దీంతో సిబ్బందే స్వయంగా పర్యవేక్షిస్తారన్నారు. పెట్రోల్ వాహనాలపై సర్వేలెన్స్ను ఏర్పాటు చేసి, లైవ్ ట్రాకింగ్ చేస్తున్నామన్నారు. కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా కోర్టుల్లో కేసుల విచారణ ప్రక్రియపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ ఏడాది 5542 కేసుల్లో శిక్షలు పడ్డాయని, గత ఏడాదితో పోలిస్తే ఇది 9 శాతం పెరిగిందన్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ, ఎన్ఫోర్స్మెంట్పై దృష్టి పెట్టామన్నారు.