ముషీరాబాద్, జనవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న కంటి వెలుగు పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో కంటి పరీక్షల కోసం ఏర్పాటు చేసే సెంటర్లను గుర్తించి, అన్ని విభాగాలను సమన్వయం చేసుకొని ముందుకుసాగాలని సూచించారు. బుధవారం ఆయన జీహెచ్ఎంసీ సర్కిల్-15 డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ, ఏఎంహెచ్ఓ మైత్రేయి, వైద్య శాఖ అధికారులతో కలిసి అడిక్మెట్ కమ్యూనిటీహాల్ను పరిశీలించారు. కమ్యూనిటీహాల్లో కంటి వెలుగు సెంటర్ ఏర్పాటు కోసం వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అడిక్మెట్ కమ్యూనిటీహాల్ నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఫ్యాన్లు, మూత్రశాలలు వంటి సౌకర్యాలు కల్పించడంతోపాటు పారిశుధ్యం, వాహనాల అక్రమ పార్కింగ్నకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కమ్యూనిటీహాల్ నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో కంటి వెలుగు సెంటర్ల ఏర్పాటు కోసం వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ మురళి, బీఆర్ఎస్ పార్టీ అడిక్మెట్ డివిజన్ అధ్యక్షుడు బి. శ్రీనివాస్రెడ్డి, కె.సురేందర్, శ్యామ్సుందర్, మాధవ్, రవియాదవ్, ముచ్చకుర్తి ప్రభాకర్, రాజు పాల్గొన్నారు.
సొసైటీలో పైపులైన్ పనులు చేపట్టాలి..
ముషీరాబాద్ : భరత్నగర్ అరుణ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాలనీలో వెంటనే డ్రేనేజీ పైపులైన్ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్, జలమండలి ఎండీ దానకిశోర్ను సొసైటీ సభ్యులు కోరారు. బుధవారం వారు ఎమ్మెల్యేను కలిసి తమ బస్తీ డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే జలమండలి ఎండీకి ఫోన్లో సమస్యను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు డివిజన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్రెడ్డి, నాయకులు ఎయిర్టెల్రాజు, శ్రీధర్చారి, శివముదిరాజ్, శ్రీనివాస్, అరుణహౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు డేనియల్, ప్రధాన కార్యదర్శి ఆనంద్, వీరేందర్, విశ్వనాథ్ జలమండలి ఎండీ కార్యాలయ కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేశారు.