ఉస్మానియా యూనివర్సిటీ: సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ ఉత్తీర్ణత కాకపోవడంతో ఓయూ టెక్నాలజీ కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నన ఓ విద్యార్థి బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు యత్నించాడు. తోటి విద్యార్థులు గమనించి హుటాహుటిన వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రణయ్ శశాంక్ (22) మొదటి సెమిస్టర్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యారు.
దీంతో రీవాల్యూయేషన్ కు దరఖాస్తు చేసుకుని పాసయితాననే విశ్వాసంతో సప్లమెంటరీ పరీక్షకు కూడా హాజరు కాలేదు. తీరా రీవాల్యుయేషన్లో కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఇటీవల విడుదలైన గేట్ ఫలితాల్లో ఉత్తమ స్కోరు సాధించిన ప్రణయ్కు పీజీలో ఐఐటీల్లో ప్రవేశం పొందే అవకాశం లభించింది. అంతకు ముందుగానే అతడు ఆన్లైన్ లో ఓ కోర్స్ పూర్తి చేశాడు. దానిని పరిగణనలోకి తీసుకొని క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా తనను పాస్ చేయాలని కోరారు.
దీనికి అధికారులు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రణయ్ హాస్టల్ కి వెళ్లి బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్నేహితులు అతన్ని దుర్గాబాయ్ దేశముఖ్ వైద్యశాలకు.. అక్కడి నుంచి నిమ్స్ కు తరలించారు. దీంతో విద్యార్థులు గురువారం ఉదయం కళాశాలలో ఆందోళనకు దిగారు. అధికారుల వైఖరితోనే ప్రణయ్ ఆత్మహత్యకు యత్నించాడని ఆరోపించారు. ఓయూ వీసీకి వ్యతిరేకంగా నినదించారు.
ఇతర యూనివర్సిటీల్లో క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు తమ కళాశాలలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. ప్రణయ్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమేశ్ కుమార్ వివరణ ఇస్తూ నిబంధనల ప్రకారమే తాము వ్యవహరించామని స్పష్టం చేశారు. నియమ నిబంధనలకు అనుగుణంగా క్రెడిట్ ట్రాన్స్ఫర్ సాధ్యపడదని చెప్పారు. ప్రణయ్ ఉదంతంపై అధికారులు సమావేశమై చివరి సంవత్సరం విద్యార్థులకు ఐదవ సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలను మరోసారి నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.