సిటీబ్యూరో, జూన్ 11(నమస్తే తెలంగాణ ): మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ , సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 10 కోట్లకు పైబడిన ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పనుల వేగవంతమైన అమలు, పర్యవేక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు కార్పొరేషన్లకు వేర్వేరుగా కమిటీ-ఒకటి, రెండు, మూడు విభాగాలుగా పునర్వ్యవస్థీకరిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ గురువారం (జూన్ 11) జీవో ఎంఎస్ నంబర్ 156 ను జారీ చేసింది. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటైన నూతన కార్పొరేషన్లలో పనుల నిర్వహణను మరింత పారదర్శకంగా, వేగంగా ముగించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేరొంది.
ఈ క్రమంలోనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ), హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫార్మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (హెచ్ సిటీ) ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. సీఎంసీ పరిధిలో రూ. 10 కోట్లకు పైబడిన పనుల సాంకేతిక మూల్యాంకనం, ప్రైస్ బిడ్ల ఓపెనింగ్ కు సంబంధించి గతంలో జరిగిన కమిటీ-2 సమావేశాల నిర్ణయాలను ప్రభుత్వం గురువారం అధికారికంగా క్రమబద్ధీకరించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ జీవో నెం. 157ను విడుదల చేశారు.
కాగా గతంలో జారీచేసిన ఉత్తర్వుల (జీవో79) ప్రకారం.. ఈ తరహా ఈపీసీ (ఈపీసీ) పనుల టెండర్ల పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ-2కి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ కన్వీనర్గా, చీఫ్ ఇంజినీర్ సభ్యుడిగా వ్యవహరించాల్సి ఉంది. అయితే సైబరాబాద్ పరిధిలోని ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ విభాగానికి ప్రత్యేకంగా అదనపు కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో కీలకమైన ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు, రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ పనులు అత్యంత ప్రాధాన్యమైనవి కావడంతో అధికారులు ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకున్నారు.
నిబంధనల సడలింపు.. అధికారుల సర్దుబాటు
పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు, అదనపు కమిషనర్ స్థానంలో సంబంధిత సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్ఈ)ను కన్వీనర్ గా, అలాగే చీఫ్ ఇంజినీర్ స్థానంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజినీర్ను సభ్యుడిగా నియమించి కమిటీ-2 సమావేశాన్ని గతంలో నిర్వహించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే సాంకేతిక మూల్యాంకనం పూర్తిచేసి, ప్రైస్ బిడ్లను ఓపెన్ చేశారు. నిబంధనల ప్రకారం కాకుండా అత్యవసర పరిస్థితుల్లో చేపట్టిన ఈ మార్పులను, కమిటీ తీసుకున్న నిర్ణయాలను క్రమబద్ధీకరించాలని సీఎంసీ కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పురపాలక శాఖ.. సీఎంసీ కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, పాత జీవో నిబంధనలను సడలిస్తూ గతంలో నిర్వహించిన కమిటీ సమావేశాల నిర్ణయాలను చట్టబద్ధం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సైబరాబాద్ పరిధిలో కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులు మరింత వేగవంతం కానున్నాయి.
కమిటీల బాధ్యతలు ఇవే..
రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు వేర్వేరుగా ఏర్పాటైన ఈ మూడు ఉన్నత స్థాయి కమిటీలు ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నాయి.
కార్పొరేషన్ల వారీగా కమిటీల నిర్మాణం
ఎంఎంసీ -ఈ కమిటీలలో పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ చైర్మన్గా, హైదరాబాద్ జలమండలి డైరెక్టర్ (టెక్నికల్) మెంబర్గా వ్యవహరిస్తారు. మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
సీఎంసీ – ఈ కార్పొరేషన్ కమిటీలకు సైతం పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ చైర్మన్గా వ్యవహరిస్తారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ కన్వీనర్గా వ్యవహరిస్తూ టెండర్లు, సాంకేతిక పనుల పర్యవేక్షణ బాధ్యతలను చూసుకోనున్నారు. కాగా గతంలో జీహెచ్ఎంసీ విభజన ద్వారా ఏర్పాటైన నూతన కార్పొరేషన్లలో మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలని ఆయా కార్పొరేషన్ల కమిషనర్లు కోరిన నేపథ్యంలో, ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ద్వారా ఈ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తూ పనులకు మరింత క్లియరెన్స్ ఇచ్చింది.