సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ) : జలమే మానవాళికి జీవనాధారం. అందుకే వాననీటి సంరక్షణపై జలమండలి అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కుకు ఇటీవల విపరీతంగా తాకిడి పెరిగింది. నీటిని ఒడిసిపట్టే 42 రకాల నమూనా పద్ధతులు ఉన్న ఈ నీళ్ల పార్కుకు రోజూ 300 మంది విద్యార్థులు వచ్చి, నీటిని పొదుపుగా వాడడం, ఇంకుడు గుంతలను నిర్మించుకోవడం వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు. పిల్లలకు నీటి విలువ గురించి తెలియజేసే యానిమేషన్ వీడియోలు, హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరాపై త్రీడీ వీడియోలు, వాననీటిపై చోటాభీమ్ వీడియోలు ఇందులో ప్రదర్శిస్తారు. అదేవిధంగా సౌరశక్తి వినియోగం గురించి తెలియజెప్పేలా కూకట్పల్లిలో ఎనర్జీ థీమ్ పార్కును అభివృద్ధి చేస్తున్నారు.
రూ. 2.5 కోట్లతో ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన ఈ థీమ్పార్కు త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇదిలా ఉంటే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ. 17 కోట్లతో బీబీనగర్, భువనగిరి చెరువుల సుందరీకరణ పనులకు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.
వాననీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు జలమండలి ఏర్పాటు చేసిన వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నది. ముఖ్యంగా కళాశాల, పాఠశాల విద్యార్థుల తాకిడి ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. ప్రతి రోజూ ఈ నీళ్ల పార్కుకు 300మంది విద్యార్థులు తరలివచ్చి, నీటిని పొదుపుగా వాడడం, ఇంకుడు గుంతలను నిర్మించుకోవడం వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కళాశాల, పాఠశాలల విద్యార్థులు ఈ థీమ్ పార్కును సందర్శించేలా జలమండలి సన్నాహాలు చేస్తున్నది. నీటిని ఒడిసిపట్టే పద్ధతులకు చెందిన 42రకాల నమూనాలు ఈ పార్కులో నిర్మించబడ్డాయి.
విద్యార్థులను కట్టిపడేస్తున్న మాట్లాడే చెట్టు
పిల్లలకు నీటి విలువ గురించి తెలియజేసే యానిమేషన్ వీడియోలు, కృష్ణా, గోదావరి నదుల నుంచి హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని తరలిస్తున్న విధానంపై త్రీడి రూపంలో ఉన్న వీడియోలు ఇందులో ప్రదర్శిస్తారు. నీటి సంరక్షణకు పార్కులో ఏర్పాటు చేసిన నిర్మాణాలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పార్కులో ఏర్పాటు చేసిన మాట్లాడే చెట్టు విద్యార్థులను కట్టిపడేస్తుంది. ఈ చెట్టు ఆడవుల వల్ల వర్షాలు ఎలా కురుస్తాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు అడవుల వల్ల ప్రయోజనాలపై వివరిస్తుంది.
చోటాభీమ్ వీడియోలు
గొడుగు అకారంలో నాలుగు గజెటోలను నిర్మించారు. వాననీరు వీటిపై పడగానే ఆ నీరు పక్కనే ఉన్న సంపులోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. విద్యార్థులను ఆకర్షించేందుకు పలు రకాల ఆటలను పరిచయం చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ స్కేలుపై మనిషి నిలబడితే ఆ వ్యక్తి ఒంట్లో ఎంత నీరు ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఐదు నిమిషాల నిడివితో కూడిన వాననీటి సంరక్షణ చర్యలు సులువుగా ఆర్థమయ్యేలా చోటాభీమ్ వీడియోలు రూపొందించారు.
పార్కును సందర్శిస్తున్నదేశ విదేశాల ప్రతినిధులు
2018లో ప్రారంభమైన ఈ పార్కు ఇప్పటి వరకు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినాదులు సందర్శించారు. నగరంలోని పలు కళాశాలలు, పాఠశాలకు చెందిన 20వేలకు పైగా విద్యార్థులు పిక్నిక్కు వచ్చారు. కాన్పూర్, తమిళనాడులో ఈ తరహా థీమ్ పార్కును నిర్మించుకోవడానికి జలమండలి నుంచి థీమ్ పార్కుకు చెందిన సాంకేతిక నిర్మాణ వివరాలను అధికారులు సేకరించారంటే ఈ పార్కు ప్రత్యేకతను చాటుకున్నది.
అర్థమైందా..?
కాగా నీటి ఆదా గురించి పిల్లలు తెలుసుకున్న విజ్ఞానాన్ని పరీక్షించుకునేందుకు ప్రత్యేకంగా క్విజ్ కియోస్క్లను ఉంచారు. ఆ విద్యార్థికి ఏ మేర అర్థమైందనే విషయం తెలుసుకునేందుకు చిన్న చిన్న ప్రశ్నలుంటాయి. ఎన్ని ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వగలిగితే అన్ని మార్కులు వస్తాయి. విద్యార్థి పేరు, స్కూల్ తదితర వివరాలతో జ్ఞాపికను అందిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఎండీ దానకిశోర్ ఆదేశాల మేరకు ఈ థీమ్ పార్కును అభివృద్ధి చేశామని, ఎన్జీఓలతో కలిసి విద్యార్థులు, దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు ఈ పార్కును ఆదర్శంగా తీసుకుంటున్నారని జలమండలి అధికారి సత్యనారాయణ తెలిపారు.