మియాపూర్: ఆల్విన్ కాలనీ శంషీగూడ పరిధిలో అంబీర్ చెరువు ప్రధాన తూమును ఓ బడా నిర్మాణ సంస్థ యథేచ్ఛగా కబ్జా చేసి.. ధ్వంసం చేస్తున్నది. అభివృద్ధి పేరుతో బడా భవనాల నిర్మాణానికి అడ్డుగా ఈ కాలువ వస్తుండటంతో తనకున్న ఆర్థిక, రాజకీయ పలుకుబడితో ఈ తతంగాన్ని నడిపిస్తున్నది. ఫలితంగా చెరువు తూము ద్వారా నీరు ముందుకు పారే దారి లేక కాలనీలకు ముంపు ముప్పు అనివార్యం కానున్నది. గతంలోనూ ఇదే తరహాలో స్థానికులు తూము కాలువను వ్యర్థాలతో నింపి కబ్జా చేసేందుకు యత్నించగా, ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని ప్రచురించడంతో రెవెన్యూ అధికారులు స్పందించి కబ్జాను అడ్డుకుని తూమును పునరుధ్ధరించారు.
ప్రస్తుతం అదే తూమును ఓ బడా నిర్మాణ సంస్థ కబ్జా చేసి ధ్వంసం చేస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నోరు మెదపకపోతుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. కాగా, అంబీర్ చెరువు ప్రధాన తూము కాలువను సదరు నిర్మాణ సంస్థ ధ్వంసం చేసి.. కాలువ రాళ్ల తెట్టను సైతం పూర్తిగా పెకిలించింది. అదే స్థలంలో భారీ నివాస సముదాయాన్ని నిర్మించేందుకు తమకు అడ్డుగా ఉన్న కాలువను ఆనవాళ్లు లేకుండా చేసింది. ఫలితంగా అంబీర్ చెరువు నుంచి ఎల్లమ్మ చెరువుకు గొలుసుకట్టు కాలువ పూర్తిగా కబ్జాకు గురై నీటి ప్రవాహానికి దారి లేకుండా పోయింది. ఈ విషయమై కూకట్పల్లి తహసీల్దార్, ఇరిగేషన్ ఏఈలను నమస్తే ప్రతినిధి సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.