నిషేధిత కార్బైడ్ను వాడితే కఠినచర్యలు
హోంమంత్రి మహమూద్ అలీ
పండ్లు త్వరగా పక్వానికి వచ్చేందుకు చైనా విష రసాయనాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సహజ సిద్ధంగా మగ్గబెట్టే ఎన్రైప్ మిక్సర్ను వాడాలని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్యార్డులో సహజ సిద్ధంగా పండ్లను పక్వానికి తెచ్చే ఎన్రైప్ మిక్సర్ను హోంమంత్రి మహమూద్ అలీ, ఆగ్రోస్ ఎండీ రాములుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిషేధిత రసాయనాలతో పండ్లను పక్వానికి తేవడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతోందన్నారు. సహజ పద్ధతుల్లోనే మామిడి కాయలను పక్వానికి తేవాలని, ప్రతి వ్యాపారి ఎన్రైప్ను వినియోగించాలని సూచించారు. ఆహార కల్తీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే సూచించినట్లు మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆగ్రోస్ డైరెక్టర్ రవీందర్, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ కార్యాలయం అధికారులు పాల్గొన్నారు.