సిటీబ్యూరో, జనవరి 16(నమస్తే తెలంగాణ) : నిత్యం వేలాది వాహనాల కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే నగర వాసులు సంక్రాంతి సెలవులతో ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో వాహనాల రద్దీ తగ్గడంతో గాలిలో సూక్ష్మ ధూళి కణాల తీవ్రత భారీగా తగ్గింది. దీంతో పీసీబీ సూచించిన ప్రామాణిక విలువల కంటే తక్కువగా గాలి నాణ్యత సూచిక ఉంది. 12 నుంచి సంక్రాంతి సెలువులు రావడం, వెంటనే వీకెండ్ కూ డా కలిసి రావడంతో వాహనాలు, పరిశ్రమలు పూర్తి గా మూసివేశారు. దీంతో నగరంలో గాలి నాణ్యత మెరుగుపడిందని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి.
14 ప్రాంతాల్లో మానిటరింగ్
నగరంలో మొత్తం 14 ప్రాంతాల వారీగా గాలి నాణ్యత, కాలుష్య తీవ్రతను టీఎస్పీసీబీ మానిటరింగ్ చేస్తున్నది. ఈ క్రమంలో వాహనాల రద్దీ, జన సంచారం, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నది. దీని ద్వారా గాలిలో రసాయనాలతోపాటు, సూక్ష్మ ధూళి కణాల తీవ్రతను బట్టి గాలి నాణ్యత లెక్కిస్తున్నది. ముఖ్యంగా నెహ్రూ జువాలజికల్ పార్కు, పాశ మైలారం, ఇక్రిసాట్ పరిసర ప్రాంతాల్లో గడిచిన మూడు నెలలుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవల్స్ దారుణంగా పడిపోయినట్లుగా తేలింది. గడిచిన కొంత కాలంగా నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. వ్యక్తిగత వాహనాల రాకపోకలు పెరగడంతో కాలుష్య ఉద్గారాల తీవ్రత గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యం ఐదు రోజుల గాలి నాణ్యత సూచీలను పరిశీలించగా, మెరుగైన వాతావరణమే ఉందని పేర్కొన్నారు.
మెరుగుపడిన వాతావరణం
నిజానికి వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పీఎం10, పీఎం2.5 కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ గడిచిన నాలుగు రోజుల్లో 90 లోపే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. అత్యధికంగా సనత్నగర్(154), బేగంపేట్(152), బొల్లారం పటాన్చెరు(152), జూ పార్క్ (137), ఈసీఐఎల్(125)గా ఉంటే.. మిగిలిన ప్రాంతాలైన కోకాపేట్(86), నాచారం ఐలా(77), కొంపల్లి(86), ఆర్సీపురం(78), హెచ్సీయూ(78), సోమాజీగూడ(92)గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. గత మూడు రోజుల ఈ పరిమాణంలోనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు అవుతుందని, వాహనాల రద్దీ తగ్గడం, సంక్రాంతి సెలవుల కారణంగా పరిశ్రమల కార్యకలాపాలు నిలిచిపోవడంతోనేనని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి.
ఐదు రోజుల్లో పెరిగిన గాలి నాణ్యత
గత కొంత కాలంగా సెంట్రల్ పీసీబీ నిర్దేశించిన ప్రమాణాల కంటే గాలి నాణ్యత సూచీలు రెండింతలు ఎక్కువగానే ఉంది. దీంతో అత్యంత దారుణంగా గాలి నాణ్యత నమోదవుతుండగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు కొంత ఇబ్బంది పడుతున్నారు. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో సగటున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 120-200లోపు నమోదు అవుతుంది. ఇందులో అత్యధికంగా కాలుష్య తీవ్రత ఉన్న ప్రాంతాల్లో నెహ్రూ జూ పార్క్, పాశా మైలారం, ఇక్రిసాట్తోపాటు ఈసీఐఎల్, మలక్పేట్, జీడిమెట్ల ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం వాహనాల రద్దీతోపాటు, పారిశ్రామిక కార్యకలాపాలే. గడిచిన మూడు నెలల కాల వ్యవధిలో వాతావరణంలో పీఎం 2.5, పీఎం 10, నైట్రోజన్ పరిమాణం పరిమితికి మించి చేరుతున్న నేపథ్యంలో ఈ ఐదురోజులలో గాలి నాణ్యత పెరగడం నగరవాసులకు కొంత ఊపిరి పీల్చుకునేలా ఉంది.