సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ అధికారులను, వినియోగదారులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజినీర్లు వారి పరిధిలో ఉన్న డీఈ, ఏడీఈ, ఏఈలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో ఫీడర్లు ట్రిప్ కాకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. మాన్సూన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రతి డివిజన్లో మూడు బృందాలు అందుబాటులోఉంటాయని, 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆపరేషన్స్ డైరెక్టర్ తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రమాదాలకు అవకాశం ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, సర్వీస్ వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫిర్యాదుల స్వీకరణకు 1912 కాల్ సెంటర్ అందుబాటులో ఉందన్నారు. ముఖ్యంగా అపార్టుమెంట్ సెల్లార్లోకి నీరు చేరితే వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు.