సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): వేసవి గండాన్ని ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ అష్టకష్టాలు పడుతున్నది. ఒకవైపు గణనీయంగా పెరుగుతున్న కరెంటు డిమాండు, మరోవైపు క్షేత్రస్థాయిలో రకరకాల సమస్యలు విద్యుత్ శాఖకు అగ్ని పరీక్షగా మారాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 55 లక్షలకు పైగా గృహ, వ్యాపార, పరిశ్రమలకు చెందిన విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) పరిధిలోని జీహెచ్ఎంసీ పరిధి అత్యంత కీలకమైందిగా ఉంది.
సింహభాగం విద్యుత్ వినియోగం అంతా ఇక్కడే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు వేసవి కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. కోతలకు అవకాశం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించడం పైనే ప్రధానంగా దృష్టి సారించారు. అధికార యంత్రాన్ని నిరంతరం అప్రమత్తంగా ఉంచేందుకు డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ప్రతి రోజూ ఉదయం 8.30 గంటల నుంచే విద్యుత్ సరఫరా తీరుపై సమీక్షిస్తున్నారు.
గతేడాది మేలో ఉన్న డిమాండు ఈ ఏడాది మార్చిలోనే ఉంది. గతేడాది మే నెలలో 79 మిలియన్ యూనిట్లు వినియోగం అయితే, ఈ ఏడాది మార్చి నెలలో 75 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా చేపట్టిన పనులకు ఎల్సీ (లైన్ క్లియరెన్స్)లు ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిరంతరం ఇచ్చేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు.
దీనికి తోడు విద్యార్థులు పరీక్షలు జరుగుతుండటంతో విద్యుత్ అంతరాయం అనే మాటకు చోటు లేకుండా ఉండాలని సీఎండీ ఆయా జోన్ల సీజీఎంలు, సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్లతో నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇంకా రెండు నెలల కాలం విద్యుత్ శాఖకు అగ్నిపరీక్ష వంటిదని, దానికి తట్టుకునేలా క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం అంతా సరఫరాపై ప్రధానంగా దృష్టిసారించాలని సూచించారు.
గ్రేటర్ పరిధిలో ఉండే 9 సర్కిళ్ల పరిధిలో విద్యుత్ సరఫరా తీరును ఫీడర్ల వారీగా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. 33కేవీ ఫీడర్లు 1400 ఉండగా, 11కేవీ ఫీడర్లు 4వేల వరకు ఉన్నాయి. ఆయా ఫీడర్ల పరిధిలో ప్రతి రోజూ సరఫరాలో ఎదురైన ఇబ్బందులపైనా ప్రతి రోజు సీజీఎం ఆపరేషన్స్, ఆయా సర్కిళ్ల ఎస్ఈలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. సర్కిల్ ఎస్ఈతో పాటు ఆపరేషన్స్ డీఈ, ఏడీఈ, ఏఈలు ఎక్కువ సమయంలో క్షేత్ర స్థాయిలో ఉండి కరెంటు సరఫరా తీరును పరిశీలించాలని సీఎండీ సూచించడంతో సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఉన్న చోటకు ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షిస్తున్నారు.
వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ఉండేందుకు సెక్షన్ స్థాయిలో ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఆయా సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్లు సెక్షన్ స్థాయిలో పనిచేసే సబ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. విద్యుత్ డిమాండుకు ఎక్కువగా ఉండటంతో పాటు అంతరాయాలు ఏర్పడేందుకు అవకాశం ఉండటంతో అధికారులు, ఇతర ఉద్యోగులు విద్యుత్ సరఫరా పర్యవేక్షించేందుకు సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద పరిశీలన చేస్తూ ఉండాలంటున్నారు.