సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : వేసవి తీవ్రత పెరగకముందే విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతున్నది. ఈ ఏడాది వేసవి సీజన్ ప్రారంభం నుంచే విద్యుత్ వినియోగం గతేడాది కంటే ఎక్కువగా నమోదవుతూ వస్తున్నది. తాజాగా మార్చి మొదటి వారంలో ఏకంగా ఒక రోజు విద్యుత్ వినియోగం 70.71 మిలియన్ యూనిట్లు (7.07 కోట్లు)గా మార్చి 7వ తేదీన అత్యధికంగా నమోదైందని అధికారులు తెలిపారు. అదే సమయంలో గతేడాది మార్చి 5వ తేదీన అత్యధికంగా 52.15 మిలియన్ యూనిట్లు (5.21 కోట్లు)గా నమోదు కాగా, అత్యధిక విద్యుత్ డిమాండ్ 2472 మెగావాట్లు ఉంది.
ఏడాది వ్యవధిలోనే 1.2కోట్ల యూనిట్ల వినియోగం పెరిగింది. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో విద్యుత్ 8 కోట్ల యూనిట్ల నుంచి 9 కోట్ల దాకా పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. రికార్డు స్థాయిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో వేసవి కార్యచరణ చర్యలు చేపట్టామని, అదనంగా ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్లు, సబ్ స్టేషన్ల వద్ద పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో, సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని పట్టణ ప్రాంతంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ నివాస ప్రాంతాలకు తోడు పరిశ్రమలు కొత్తగా ఏర్పాటవుతుండడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నదని అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా గ్రేటర్ శివారు ప్రాంత సర్కిళ్లు అయిన కుత్బుల్లాపూర్, మేడ్చల్, రాజేంద్రనగర్, సరూర్నగర్, హబ్సిగూడల్లోనూ విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని అధికారులు తెలిపారు.