సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): విద్యుత్ వినియోగదారులకు దక్షిణ డిస్కం తీసుకొస్తున్న కొత్త నిబంధనలు భారంగా మారుతున్నాయి. పాత బిల్డింగుల్లో అదనపు లోడ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎవరికైతే ఓసీలు లేవో వారు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లతో పాటు దరఖాస్తు చేయాలని అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే పాత బిల్డింగులలో పర్మిషన్ లేని ఫ్లోర్లకు సంబంధించి కనెక్షన్ల విషయంలో తీసుకుంటున్న నిర్ణయంతో టీజీఎస్పీడీసీఎల్ వినియోగదారుల నడ్డి విరుస్తోంది.
విద్యుత్ సరఫరా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఓసీలు లేవని, పర్మిషన్లు లేవనే పేరుతో కనెక్షన్లు ఇవ్వకపోగా.. ఇప్పటికే కనెక్షన్ తీసుకున్నవారికి నిబంధనల పేరుతో అడ్డగోలుగా బిల్లులు వేస్తున్నది. నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థల ఆదాయాన్ని పెంచుకోవడానికి విద్యుత్ చార్జీలు పెంచకుండానే పరోక్షంగా ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ రకరకాల నిబంధనలను తెరమీదికి తీసుకువస్తున్నారు. ఇప్పటికే 20 కిలోవాట్స్ ఉన్న వారు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని, గదులను బట్టి వాట్స్ తీసుకోవాలంటూ నిబంధన విధించిన డిస్కం అనుమతులు లేని ఫ్లోర్లకు తాత్కాలిక కేటగిరీ కింద బిల్లుల వడ్డింపుపై దృష్టిపెట్టింది.
ఈ నిబంధన అమలులోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్లో ఎనిమిది నుంచి పదిలక్షల మంది విద్యుత్ వినియోగదారులపై ఈ ప్రభావం పడనుంది. కేటగిరీ మారిస్తే సదరు విద్యుత్ వినియోగదారుడికి ప్రస్తుతం వస్తున్న బిల్లు కంటే మూడింతలు అధికంగా బిల్లు వచ్చే అవకాశముంది. ఆక్యుపెన్సీ ప్రామాణికంగా కేటగిరీలు మారిస్తే మెజారిటీ చార్జీల భారం అద్దెకు ఉంటున్న వారిపై పడుతుంది.
అదనపు ఫ్లోర్లను తాత్కాలిక కేటగిరీలోకి..!
నగరంలో ప్రస్తుతం 67లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో హెచ్టీ (పరిశ్రమల)కమర్షియల్ కనెక్షన్లు పదిలక్షల వరకు ఉంటాయి. అవి కాకుండా మరో 57లక్షల వరకు గృహ విద్యుత్ కనెక్షన్లు ఉంటాయి. ఈ డొమెస్టిక్ కనెక్షన్ల వద్దనే అసలు సమస్య ఉత్పన్నం అవుతున్నట్లు విద్యుత్ రంగ నిపుణులు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్లో మూడు నుంచి ముప్ఫై అంతస్తుల వరకు పెద్ద పెద్ద భవనాల నిర్మాణం జరుగుతుంది. ఇందులో కొన్నింటికి రెండు మూడు అంతస్తుల వరకే అనుమతులు ఉంటే అంతకుమించి ఉన్న సముదాయాలే ఎక్కువగా ఉంటాయి. వాటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చే సమయంలో అనుమతి ఉన్నంత వరకే తీసుకుని తర్వాత మిగిలినవాటికి కూడా విద్యుత్ కనెక్షన్లు తీసుకున్నారు.
అవి ప్రస్తుతం డొమెస్టిక్గానే ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణ డిస్కం అధికారులు చెబుతున్న ప్రకారం ఈ కనెక్షన్లలో డొమెస్టిక్నుంచి టెంపరరీగా మారితే బిల్లు మోత మోగుతుంది. డిస్కమ్ నిర్ణయించిన స్లాబ్ ప్రకారం వీరికి మూడువందల యూనిట్ల వరకు బిల్లులు వస్తుంటే వాటికి వేయి రూపాయల నుంచి పదిహేనువందల వరకు బిల్లు వస్తుంది. అంటే యూనిట్కు ఐదు నుంచి ఏడురూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ టెంపరరీ కేటగిరీకి మారితే యూనిట్కు రూ.11 కంటే పైనే ఉంటుందని తెలుస్తున్నది. ప్రస్తుతం విద్యుత్ అధికారులు ఆక్యుపెన్సీ లేకుండా ఇచ్చిన కనెక్షన్లను గుర్తించి వాటికి నోటీసులు జారీ చేశారు.
ఇంటి నిర్మాణానికి స్థానిక సంస్థలు ఇచ్చిన అనుమతులు పరిశీలించి అవి ఎన్ని అంతస్తుల వరకు ఉన్నాయో చూసి మిగతావాటిని కేటగిరీ 8 అంటే తాత్కాలిక అనుమతుల్లోకి మార్చడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో సదరు వినియోగదారుడికి బిల్లు సాధారణంగా వచ్చేదానికంటే మూడింతలు ఎక్కువగా వస్తుందని అధికారులు చెప్పారు. ఈనేపథ్యంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చే వరకు ఈభారం భరించాల్సిందేనని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి గత సంవత్సరమే ఆలోచించినా అప్పట్లో ఓసీలపైనే ఎక్కువ దృష్టి పెట్టామని, ఈసారి ఈ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వారు తెలిపారు. కరెంట్ చార్జీల పెంపు లేదంటూనే దక్షిణ విద్యుత్ సంస్థ తీసుకొస్తున్న నిబంధనలు విద్యుత్ వినియోగదారులపై భారం మోపుతున్నది.
అనుమతులు లేని ఫ్లోర్లను కేటగిరీ 8లోకి మార్చే క్రమంలో ఆ భారం అందులో అద్దెకు ఉండే వారిపై పడుతుందని వినియోగదారులు చెప్పారు. నగరంలో ఉన్న గృహ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే సమయంలో స్థానిక విద్యుత్ అధికారులు కేవలం తమకు ఆదాయం రావడమే లక్ష్యంగా సంస్థాగతంగా వారికి కనెక్షన్లు ఇచ్చారు తప్ప వారికి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయనేది పరిశీలించలేదు. గత ఆరునెలలుగా సంస్థ డైరెక్టర్లు వచ్చినప్పటి నుంచి కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి వినియోగదారుల సంక్షేమంతో పాటు సంస్థ ఆదాయానికి గండిపడేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇందులో భాగంగానే అదనపు ఫ్లోర్లకు అనుమతులు, కొత్త బిల్డింగుల పర్మిషన్లు, ఓసీలు.. ఇలా పలు రకాల నిబంధనలతో విద్యుత్ కనెక్షన్లను కఠినతరం చేశారు. ఇది ఎవరికి లాభమో తెలియదు కానీ పూర్తిగా సంస్థకు నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారమంతా చూసుకోవలసిన జీహెచ్ఎంసీ తమకేమీ పట్టనట్లుగా ఉంటున్నదని కొందరు సీనియర్ విద్యుత్ అధికారులు చెప్పారు.