దుండిగల్, మే 7: కాంట్రాక్టర్ వద్ద లంచంతీసుకుంటూ ప్రగతినగర్ విద్యుత్ సబ్స్టేషన్ ఏఈ జ్ఞానేశ్వర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్(ఎలీఫ్) సబ్స్టేషన్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఆపరేషన్)గా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్.. తన పరిధిలోని మిథిలానగర్లో ఓ బిల్డింగ్ ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ కేవీ లైన్ మార్చేందుకు నెల రోజుల క్రితం కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేయగా రూ.30వేలకు బేరం కుదిరింది.
ఆ తర్వాత రూ.15 వేలు తీసుకునేందుకు ఒప్పుకున్న జ్ఞానేశ్వర్ బుధవారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో అప్పటికే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాడుల్లో రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో 4 గంటలపాటు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రగతినగర్లోని ఏఈ కార్యాలయం, నగరంలో ఆర్టీసీ క్రాస్రోడ్డులోని ఏఈ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా కార్యాలయం సమీపంలోని కారులోను తనిఖీలు నిర్వహించడం గమనార్హం.