మరో పదేండ్లలో పెట్రోలు, డీజిల్ వాహనాల వాడకం పూర్తిగా తగ్గిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. 2030 నాటికి భూగర్భంలోని ఇంధన నిల్వలు అడుగంటి పోతాయని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతుండగా ప్రత్యామ్నాయాలపై ప్రతిఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బ్యాటరీ సాయంతో నడిచే ద్విచక్ర, త్రి చక్ర, బస్సులు రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. అనేక కంపెనీలు సైతం సామాన్యులు, పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా వాహనాలను రూపొందిస్తున్నారు.
భవిష్యత్లో ఇది మరింత విస్తృతమై పూర్తిస్థాయిలో పర్యావరణ హితమైన వాహనాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇదే తరహా విభిన్న వాహనాలను ‘వాసవీ వీల్స్’ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 1989లో ప్రారంభమైన ఈ సంస్థ 2021 వరకు 500 మోడల్స్లో వాహనాలను రూపొందించినట్లు ఆ సంస్థ సీఈవో పి. వెంకటేశం గుప్తా తెలిపారు. తాజాగా దేశంలోనే తొలిసారిగా దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ఆటోమేటెడ్ త్రిచక్ర స్కూటర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన పి.వెంకటేశంగుప్తా ఉన్నత విద్యాభాస్యం ఇక్కడే చేశారు. తొలుత పర్యావరణహితమే లక్ష్యంగా గ్రీన్సేవా ఫౌండేషన్ స్థాపించారు. కాలుష్యానికి ప్రధాన కారణమైన ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా 1989లోనే బ్యాటరీ వాహనాల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ‘వాసవీ వీల్స్’ పేరుతో నాచారంలో బ్యాటరీ, విద్యుత్ వాహనాల తయారీ కేంద్రాన్ని స్థాపించి, ప్రస్తుతం లక్డీకాపూల్, తిరుమలగిరిలో షోరూమ్లను సైతం ఏర్పాటు చేశారు.
32 సంవత్సరాలుగా వివిధ రకాల బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. 50 నుంచి 200కు పైగా కిలోమీటర్లు ప్రయాణించే వాహనాలను తయారు చేస్తున్నామని, బ్యాటరీ, వేగం, ప్రయాణించే దూరం ఆధారంగా ధరలు ఉంటాయని సీఈవో వెంకటేశం తెలిపారు.
అర యూనిట్తో ద్వి, త్రిచక్ర వాహనాలను నాలుగు గంటల్లోనే రిచార్జ్ చేయవచ్చు. ఇప్పటివరకు వందలాది డిజైన్లతో స్కూటర్లు, అంబులెన్స్లు, బస్సులు రూపొందించామని.. రివర్స్ సైతం వెళ్లడం ఈ వాహనాల ప్రత్యేకత అని ‘వాసవీ వీల్స్’ సీఈవో పి.వెంకటేశం గుప్తా తెలిపారు. ఇదిలా ఉంటే గుప్తా రాష్ట్రపతి అవార్డు, బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డుతో పాటు గిన్నీస్ బుక్లో సైతం స్థానం సంపాదించుకున్నారు.