సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా జరిగేలా పొలిటికల్ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ కోరారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. త్వరలో భారత ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందన్నారు. 16 ఈవీడీఎం డెమాన్ స్టేషన్ కేంద్రాల ద్వారా, అలాగే 15 నియోజకవర్గాల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆర్ఓ కార్యాలయాల్లో ఈవీడీఎంలపై ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించనున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితాను ప్రచురించారని, ఆ జాబితా మేరకు జిల్లాలో 45,70,138 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 23,30,574 మంది పురుష ఓటర్లు, 22, 39,240 మహిళా ఓటర్లు, థర్డ్ జెండర్ 324 మంది ఉన్నారు.
నియోజకవర్గ స్థాయిలో ప్రతి బుధవారం పొలిటికల్ పార్టీల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రొనాల్డ్రాస్ తెలిపారు. ఈ సందర్భంగా పొలిటికల్ పార్టీల ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదులను తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. పొలిటికల్ పార్టీల ప్రతినిధులు ఎంఐఎం ప్రతినిధి, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, బీఎస్పీ ప్రతినిధి కల్యాణి, బీజేపీ ప్రతినిధి వీఎస్ భరద్వాజ్, కాంగ్రెస్ ప్రతినిధి నిరంజన్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.