మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 16 : ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్కే జైన్, పూర్వాగార్గ్, జిల్లా పోలీసు పరిశీలకురాలు నేహా యాదవ్ అధికారులు, సిబ్బందికి సూచించారు. మేడ్చల్ సమీకృత కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా గ్రీవెన్స్ కమిటీ, ఎంసీఎంసీ మీడియా సెంటర్ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రీవెన్స్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ మూర్తితో మాట్లాడారు. సీజ్ చేసిన నగదు, తిరిగి ఇచ్చిన మొత్తం.. తదితర వివరాలపై ఆరా తీశారు. అనంతరం స్టాటిక్ సర్వేలెన్స్, మీడియా సర్వేలెన్స్ బృందాల లైవ్ స్ట్రిమింగ్ను పరిశీలించారు. కంట్రోల్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. పలు సలహాలు, సూచనలు చేశారు. ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రకటనలు, పెయిడ్ న్యూస్, ఫేక్ న్యూస్.. తదితర వివరాలను తెలుసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే కోఢ్ ఉల్లంఘనలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సామాజిక మాధ్యమ సెల్ చురుగ్గా పని చేస్తుందని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇదే ఒరవడిని కొనసాగించాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ చానళ్లలో వచ్చే రాజకీయ ప్రకటనలు, ప్రచారాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని వారు సూచించారు.
ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం ;ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ అన్నారు. గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మాస్టర్ ట్రైనర్స్కు ఎన్నికల అధికారి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలింగ్ విధులు సమర్థవంతంగా నిర్వహించేలా పీఓలకు మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కల్పించాలని తెలిపారు. పోలింగ్పై పీఓలకు పూర్తి అవగాహన కల్పించాలని మాస్టర్ ట్రైనర్స్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.