ఉప్పల్ మల్లాపూర్లోని వీఎన్ఆర్ గార్డెన్లో బుధవారం ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి అధ్యక్షతన మహిళల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సమ్మేళనానికి హాజరైన మహిళలంతా బీఆర్ఎస్దే గెలుపు అంటూ.. పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు.
సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : నామినేషన్ల ప్రక్రియ ఊపందుకున్న దరిమిలా అభ్యర్థులను వ్యయ పరిశీలకులు నీడలా వెంటాడుతున్నారు. సభలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, కార్యకర్తల భోజనాలు, వాహనాల కేటాయింపులతో ప్రచారం హోరెత్తిస్తున్న తరుణంలో అభ్యర్థుల లెక్క పక్కాగా లెక్కించేందుకు గానూ ఈ బృందాలు డేగ కన్ను వేశాయి. అభ్యర్థులు హద్దులు దాటకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. నిర్దేశించిన రూ.40లక్షల ఖర్చుపై అమలవుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించింది. ఈ బృందాలు నిత్యం అభ్యర్థుల ఖర్చును లెక్కిస్తూ ఉన్నారు. రోజూ ఎవరెంత ఖర్చు చేస్తున్నారో వీడియో దృశ్యాల ఆధారంగా లెక్క గడుతున్నారు. ఎన్ని కుర్చీలు, టెంట్లు వేశారు. ఎన్ని మైక్ సెట్లు పెట్టారు. ఎన్ని వాహనాలు వినియోగించారు. ఎంత మందికి భోజనాలు ఏర్పాటు చేశారనేది ఖర్చు లెక్కించి షాడో రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. అభ్యర్థులు కూడా పోలింగ్ నాటికి ఖర్చు వివరాలను మూడు విడతల్లో ఆడిట్ బృందాలతో తనిఖీలు చేయించుకోవాల్సి ఉంటుంది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని 1951లో రూపొందించారు. ఏ అభ్యర్థి ఎంతమేర ప్రచారానికి ఖర్చు పెట్టాలనేది నిర్దేశిస్తూ సెక్షన్ 19లో వివరించారు. ఎన్నికలు జరిగే సమయంలో ధరలకు అనుగుణంగా వాటిని వెల్లడిస్తారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బరిలో నిలిచే అభ్యర్థి వ్యయ పరిమితి రూ.40లక్షలుగా నిర్ణయించింది. 2018 ఎన్నికల్లో ఇది రూ. 28 లక్షలుగా ఉండేది. పోటీలో నిలబడే అభ్యర్థి ఈసీఐ వ్యయ పరిమితి దాటి ఖర్చు చేసినా, వాటికి సంబంధించిన లెక్కలను సరైన ఆధారాలతో సమర్పించకున్నా అభ్యర్థులపై వేటు పడుతుంది.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినప్పటీ నుంచి ఖర్చును లెక్కిస్తారు. దీనికోసం అభ్యర్థి ఏదేని జాతీయ బ్యాంకులో నూతన ఖాతా తెరవాలి. ఈ లావాదేవీలు ఆ ఖాతా ద్వారానే నిర్వహించాలి. నామినేషన్కు ముందు అభ్యర్థులు చేపట్టిన ప్రచారాలు, సభలు, ఇతర కార్యక్రమాల ఖర్చును సంబంధిత పార్టీల ఖర్చు కింద జమ చేస్తారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు.
ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోపు ప్రతి అభ్యర్థి తమ వ్యయ వివరాలను బిల్లులతో సహా అధికారులకు అప్పగించాలి. పరిమితికి మించి ఖర్చు చేసినా, లెక్కలను సరైన సమయంలో చూపకున్నా ఆ అభ్యర్థులపై వేటు పడటంతోపాటు తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారు.
స్థానికంగా ఉన్న ధరల ప్రకారం.. ఖర్చును లెక్కగడుతారు.. జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఆయా రాజకీయ పార్ట్లీల సమక్షంలో ఈనెల 17న స్థానికంగా ఉన్న ధరలను బట్టి నిర్ణయించారు.