మన్సూరాబాద్, సెప్టెంబర్ 23: ఆస్తి కోసం కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటి వేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో హైకోర్టును ఆశ్రయించిన వృద్ధ దంపతులకు న్యాయం జరిగింది. ఎట్టకేలకు రెండేండ్ల పోరాటంలో తమ సొంత ఇంటిలోకి ఆ దంపతులు అడుగుపెట్టారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధి మన్సూరాబాద్ డివిజన్ శ్రీరామ్నగర్ కాలనీలో చోటు చేసుకుంది. బాధితులు, సరూర్నగర్ మండల రెవెన్యూ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం… మన్సూరాబాద్, శ్రీరామ్నగర్ కాలనీలో కావేటి కౌసల్యాదేవి, లింగమయ్య దంపతులు నివాసముంటున్నారు. వీరికి కుమార్తె రత్నమాల, కుమారులు చంద్రశేఖర్, రాజశేఖర్ ఉన్నారు. ముగ్గురికి వివాహాలు జరిగాయి. అన్నదమ్ములైన చంద్రశేఖర్, రాజశేఖర్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. పెద్ద కుమారుడైన చంద్రశేఖర్ భార్యా, పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నాడు. తల్లి కౌసల్యాదేవి పేరుపై ఉన్న 266 గజాల స్థలంతో పాటు బ్యాంకులో ఉన్న 10 తులాల బంగారు నగలు, లక్ష నగదు ఫిక్స్డ్ డిపాజిట్లను కొల్లగొట్టేందుకు చిన్న కుమారుడైన రాజశేఖర్ ప్రయత్నించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన తల్లిదండ్రులు 23 సెప్టెంబర్ 2021న ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో రాజశేఖర్పై కేసు పెట్టారు. దీంతో రాజశేఖర్ తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటివేశాడు. ఆశ్రమాల్లో తలదాచుకుంటూ తమకు జరిగిన అన్యాయంపై కందుకూరు ఆర్డీఓతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఈ దంపతులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జూన్ 17న ఉత్తర్వులను జారీ చేశారు. ఈ దంపతులు గతంలో నివాసమున్న ఇంటితో పాటు బ్యాంకులో ఉన్న 10 తులాల బంగారు నగలు, లక్ష రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ను వారికి ఇప్పించాలని కందుకూరు ఆర్డీఓ, రాచకొండ కమిషనరేట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సదరు ఉత్తర్వులను అందుకున్న సరూర్నగర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ యాదగిరి ఎల్బీనగర్ పోలీసు సిబ్బందితో పాటు కౌసల్యాదేవి, లింగమయ్య తీసుకొని జూన్ 28న శ్రీరామ్నగర్కాలనీకి చేరుకున్నారు. విషయాన్ని ముందే తెలుసుకున్న రాజశేఖర్ హైకోర్టు నుంచి స్టే తీసుకువచ్చి తల్లిదండ్రులు ఇంట్లోకి రాకుండా అడ్టుకున్నాడు. హ్యుమన్ రైట్స్ పీపుల్ వాచ్ సంస్థ అధ్యక్షురాలు గీతారెడ్డి సహకారంతో వృద్ధులు తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. కొడుకు, కోడలుతో జరిగిన న్యాయ పోరాటంలో తల్లిదండ్రులు విజయం సాధించారు. వృద్ధ దంపతులను ఇంట్లోకి చేర్చాల్సిందిగా ఇటీవల హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను మేరకు సరూర్నగర్ మండల ఆర్ఐ యాదగిరి, పోలీసుల సహకారంతో శుక్రవారం దంపతులైన కౌసల్యదేవి, లింగమయ్యను ఇంట్లోకి చేర్చారు. వృద్ధలకు న్యాయం జరగడంలో కీలకపాత్ర పోషించిన హ్యుమన్ రైట్స్ పీపుల్ వాచ్ సంస్థను స్థానికులు అభినందించారు.