హైదరాబాద్: నగరంలో చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ కార్యక్రమం ప్రారంభమైంది. ట్యాంక్ బండ్పై ‘సండే-ఫన్డే’ కార్యక్రమం సక్సెస్ కావడంతో చార్మినార్ వద్ద కూడా ఇలాంటిది ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే.
చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోలీస్ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఆదివారం అర్థరాత్రి వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో చార్మినార్ వైపు వాహన రాకపోకలను నిలిపివేశారు. అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి వచ్చే వారి వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ గస్తీ తిరుగుతున్నాయి. వివిధ శాఖల సమన్వయంతో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.