హైదరాబాద్ : ఈ నెల 17వ తేదీ(ఆదివారం)న చార్మినార్ పరిసరాలు కళకళలాడనున్నాయి. చార్మినార్ వద్ద సండే – ఫన్డే ( Sunday – Funday ) కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ట్యాంక్ బండ్ వద్ద అలరించినట్లే చార్మినార్ వద్ద కూడా జనాలను అలరించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.
చార్మినార్ వద్ద ఇక నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సండే – ఫన్డే కార్యక్రమం కొనసాగనుంది. సాయంత్రం 6:30 గంటలకు పోలీస్ బ్యాండ్ నిర్వహించనున్నారు. రాత్రి 8:30 గంటలకు దక్కనీ మజాహియా ముషారియా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయనున్నారు. ఇక అర్ధరాత్రి వరకు లాడ్ బజార్ను తెరిచి ఉంచనున్నారు. పిల్లలను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. భోజన ప్రియులకు నోరూరించే ఫుడ్ స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు. సండే – ఫన్డే కు వచ్చే వాహనదారులకు పార్కింగ్ సదుపాయాలు కల్పించారు.
గురువారం ఉదయం చార్మినార్ ప్రాంతాన్ని అర్బన్ డెవలప్మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సీపీ అంజనీ కుమార్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరిశీలించారు. సండే – ఫన్డే ఏర్పాట్లపై సమీక్షించారు. కల్చరల్ ఈవెంట్స్ నిర్వహణతో పాటు పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించిన విషయం తెలిసిందే.