ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 26: ఉస్మానియా యూనివర్సిటీ మరొక ఘనమైన వేడుకకు వేదిక కానుంది. 24వ కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (సీఈసీ) – యూజీసీ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను ఓయూలో గురువారం నుంచి నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివల్ మూడు రోజుల పాటు జరుగనుంది. ఓయూ పరిపాలనా భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ భూషణ్ నడ్డా ఫెస్టివల్ వివరాలు వెల్లడించారు. నూతన విద్యావిధానం లక్ష్యాలను అధిగమించేందుకు డిజిటల్ విద్యావిధానం ఒక్కటే మార్గమని చెప్పారు. ఠాగూర్ ఆడిటోరియంలో జరుగనున్న ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలుగు సినిమా దర్శకుడు, ఓయూ పూర్వ విద్యార్థి శేఖర్ కమ్ముల హాజరవుతారని చెప్పారు. ప్రారంభోత్సవం అనంతరం డాక్యుమెంటరీల ప్రదర్శనను పీజీఆర్ఆర్సీడీఈ ఆడిటోరియంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, సీఈసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ మెహ్రూ, ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, ఈఎంఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ మృణాళిని, ప్రొఫెసర్ ప్యాట్రిక్, రఘుపతి పాల్గొన్నారు.
కొనసాగుతున్న టెక్నోస్మానియా
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్న టెక్నోస్మానియా 2023 వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజంటేషన్, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్, టెక్నికల్ క్విజ్ తదితర పోటీలు జరిగాయి. వివిధ అంశాలపై శ్రీవెంకట శివపార్వతి స్పిన్నింగ్ మిల్స్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, గుడ్రిచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ అడ్వైజర్ సూర్య వారణాసి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సాయిలు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హయవదన, కెమికల్ ఇంజినీరింగ్ విభాగం హెడ్ ప్రొఫెసర్ రమేశ్కుమార్, ఫుడ్ టెక్నాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ వీవీ బసవరావు, కో కన్వీనర్ డాక్టర్ పరశురామ్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు , స్టూడెంట్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 26: ఉస్మానియా యూనివర్సిటీ సెంటెనరీ పైలాన్కు అధికారులు బుధవారం శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్ కళాశాల బస్స్టాప్ వెనుక వైపు ఈ పైలాన్ను నిర్మిస్తున్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పైలాన్ను నిర్మించాలని నిర్ణయించారు. ఒక ఎకరం స్థలంలో 17 అడుగుల ఎత్తుతో రూ.70 లక్షల వ్యయంతో ఈ పైలాన్ను నిర్మించనున్నారు. మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో నిర్మిస్తున్న దీనిని పూర్తి చేసేందుకు ఆరు నెలల గడువు విధించారు. ఈ సందర్భంగా ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ నిర్మాణాన్ని మూడు నెలల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ పైలాన్ దర్శనీయ ప్రదేశంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు గోపాల్నాయక్, శ్రీరాములు, అప్పారావు, రాములు, రాజేందర్నాయక్, ప్యాట్రిక్, శ్రీనివాసులు, ఈఈ ఎండీ షఫీ, డీఈ సంజీవులు పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 26: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు, ఎంఏఎం రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.