సిటీ బ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): స్టోన్ క్రషర్లు, రాక్ క్వారీలతో గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలు కాలుష్య కోరల్లో కూరుకుపోతున్నాయి. నగర నలుమూలల్లోని నిర్మాణాలకు కంకర, స్టోన్ యాష్ను సరఫరా చేసేందుకు ఇబ్బడిముబ్బడిగా స్టోన్ క్రషర్లు, క్వారీలు వెలిశాయి. చుట్టుపక్కల గ్రామాలను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో వాటికి అనుమతులు ఇవ్వడంతో ప్రజలు పెద్ద ఎత్తున కాలుష్యం బారినపడుతున్నారు.
జనావాసాలున్నా కాలుష్య నియంత్రణ మండలి ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాయు కాలుష్యంతో పాటు శబ్ధాలు రావడంతో రాత్రిళ్లు ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బతుకీడుస్తున్నారు. జనావాసాలకు దూరంగా మాత్రమే క్రషర్లు, రాక్ క్వారీలను ఏర్పాటు చేయాల్సి ఉండగా అవేమీ పలు సంస్థలకు వర్తించడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అనుమతులిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రభావితం చేస్తున్నారు.
పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికుల సలహాలను పట్టించుకోకుండా తమకు అనుకూలమైన సంస్థలకు విచ్చలవిడిగా అనుమతులిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల శివారు గ్రామాలన్నీ క్రషర్లు, క్వారీలతో తీవ్ర ప్రభావితమవుతున్నాయని పలు పర్యావరణ నివేదకలు వెల్లడిస్తున్నాయి. ప్రమాదకర స్థాయిలో పీఎం-10, పీఎం-2.5 ధూళి కణాలు వెలువడుతూ ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలపై వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని నివేదికలు చెప్తున్నా ఈసీ అధికారులు, ఆయా క్రషర్ల సంస్థలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని పలువరు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రషర్ల పరిసరాల్లో ధూళి కణాలు చేరి పొగమంచును తలపిస్తూ చెట్లు, జీవ జాతులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్రషర్లు, క్వారీల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రషర్లు, క్వారీల నుంచి సిలికా ధూళి కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఆస్తమా, బ్రాంకైటిస్, సిలికోసిస్ వంటి ప్రాణాంతక ఊపిరితిత్తుల వ్యాధులు కలుగుతున్నాయి. వాటిలో పనిచేసే కార్మికులు, సమీప గ్రామాల ప్రజలు తరచూ కంటి సమస్య, చర్మ, అలర్జీలు, దీర్ఘకాలిక దగ్గు, ఛాతీ నొప్పితో పాటు అలసటతో బాధపడుతున్నారు. యంత్రాల చప్పుళ్లు, క్రషర్ల పనితీరు తీవ్ర స్థాయిలో శబ్ధాలను కలిగించడంతో సమీప ప్రజలు, కార్మికుల్లో వినికిడిలోపం, మానసిక సమస్యలు, ఒత్తిడి ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ శివార్లు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని క్రషర్ల సమీప ప్రజల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కానీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం ప్రజల ఆరోగ్యం, పర్యావరణ ప్రభావాలను పట్టించుకోకుండా ఆయా సంస్థల నుంచి ముడుపులు తీసుకుంటూ అనుమతులు ఇస్తున్నారని పర్యవరణవేత్తలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో వ్యవసాయం పైనా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా ప్రజలు, పర్యావరణానికి హాని కలిగించే క్వారీలు, క్రషర్లను మూసేయాలని కోరుతున్నారు.