సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : మహానగరాభివృద్ధికి నగరవాసులు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ ఆర్థిక (2022-23) సంవత్సరానికి ఆస్తిపన్ను ముందే చెల్లించి రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. 5 శాతం రాయితీతో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఎర్లీబర్డ్ (ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపు) పథకం శనివారం రాత్రి ముగిసింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, అంతకుమించి రూ.738 కోట్లు వసూలయ్యాయి.
కేవలం నెల వ్యవధిలో ఇంత వసూలు కావడం నగరపౌరుల బాధ్యతకు నిదర్శనమని, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఊతమిస్తుందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా శేరిలింగంపల్లి సర్కిల్ నుంచి రూ.91 కోట్లు వసూలయ్యాయి. మొత్తం 7.22 లక్షల మంది పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఇందులో 66 శాతం (రూ.330 కోట్లు) ఆన్లైన్లో చెల్లించడం విశేషం. బిల్కలెక్టర్ల ద్వారా 12 శాతం, మీసేవ కేంద్రాల ద్వారా 11.25 శాతం, కస్టమర్ సర్వీసు సెంటర్ల ద్వారా 11 శాతం మంది పన్ను చెల్లించారు.
నగరాభివృద్ధికి ఫిదా
‘మీరు చెల్లించిన పన్నులతోనే పనులు చేస్తున్నాం.. సహకరించండి’ అంటూ నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నగరపౌరులు ఫిదా అయ్యారు. నూతన రోడ్ల నిర్మాణం, ఎస్ఆర్డీపీ ద్వారా ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణం పెద్దఎత్తున సాగుతున్నది. అనేకచోట్ల లింకురోడ్ల నిర్మాణం చేపట్టారు. మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్లు, రైతుబజార్లు, నైట్షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛత కోసం అత్యాధునిక వాహనాలతో చెత్తను ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు.