సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 ( నమస్తే తెలంగాణ): రేపట్నుంచి నగరంలో ఈ-మొబిలిటీ వారోత్సవం మొదలుకానుంది. ఈ నెల 5 నుంచి 11 వరకు హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్ జరగనుంది. ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఊతమిచ్చేల సృజనాత్మకత స్టార్టప్లను ప్రోత్సహించడం..ఈవీ వాహనాల వినియోగం పెంచడం తదితర లక్ష్యంతో వారోత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా ఈవీ సెగ్మెంట్లో భారీ పెట్టుబడులు వచ్చేందుకు ఈ సదస్సు ఉపయోగపడనుంది. ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలకు తెలంగాణ రాష్ట్రం ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ కల్పించిన విషయం తెలిసిందే.
ఆదివారం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేలా అవగాహన కల్పిస్తూ వేలాది మంది డ్రైవర్లతో ఈవీ వాహనాల ర్యాలీ ఉంటుంది. అదే రోజున బెంగళూరు, పుణె నుంచి ఈవీ వాహనాల ర్యాలీ ప్రారంభమై హైదరాబాద్ చేరుకుంటుంది. ఫిబ్రవరి 6న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సైస్టెనబుల్ మొబిలిటీ సమ్మిట్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 7న కనెక్టెడ్, అటానమస్, షేర్డ్, ఎలక్ట్రిక్(సీఏఎస్ఈ) మొబిలిటీలో వినూత్నమైన స్కేలబుల్ సొల్యూషన్స్ను ప్రదర్శించడానికి స్టార్టప్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం స్టార్టప్ గ్రాండ్ చాలెంజ్ను ప్రారంభించింది. ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్లో ఈవీ వాహనాల ప్రదర్శనలు ఉంటాయ. 10-11 వరకు హైదరాబాద్లో ఈ ఫ్రిక్స్ పోటీలు జరుగుతాయి.