ఈ ఫార్ములా రేసు ఏర్పాట్లలో భాగంగా
ఎన్టీఆర్ మార్గ్లోని చెట్లు సంజీవయ్య పార్కుకు తరలింపు
సాగర తీరంలో ఫార్ములా ఈ- రేస్ కోసం చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లో కొన్ని చెట్లను
తొలగించాల్సి వస్తున్నది. వీటిని సంజీవయ్య పార్కులో తిరిగి నాటి.. పునర్జీవనాన్ని కల్పిస్తున్నారు హెచ్ఎండీఏ అధికారులు.
సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): నిన్నటి దాకా హుస్సేన్సాగర్ తీరంలోని ఎన్టీఆర్ మార్గ్లో పచ్చని చెట్లు కనువిందు చేయడంతో పాటు నీడనిచ్చిన ఆ చెట్లన్నీ ఇప్పుడు పార్కులో సేద తీరనున్నాయి. ఫార్ములా- ఈ రేసింగ్ కోసం జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా అధికారులు అక్కడి నుంచి చెట్లను తరలించి… సంజీవయ్య పార్కులో తిరిగి నాటి పునర్జీవనాన్ని కల్పిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో దేశంలోనే తొలిసారిగా ఫార్ములా-ఈ రేసింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లోనూ ఇప్పటివరకు ఫార్ములా-ఈ రేసింగ్ లేదు. ఈ నేపథ్యంలో 2023, ఫిబ్రవరి 11న ఈ రేసింగ్ను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. సమయం సమీపిస్తుండటంతో ట్రాక్, ఇతరత్రా పనులు ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు పనులు పూర్తి చేసి… వచ్చే నెల నుంచి ట్రయల్స్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఐమాక్స్ రోడ్లో కొనసాగుతున్న ఫార్ములా-1 రేస్ ట్రాక్ పనులు
2.3 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం..
ఈ-రేసింగ్ ట్రాక్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఇందిరాగాంధీ సర్కిల్ వరకు 2.3 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం జరుగుతున్నది. ఇందుకుగాను ఆ రహదారిలో ట్రాక్ నిర్మాణానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ప్రాజెక్టు కావడంతో ఎన్టీఆర్ మార్గ్ పొడవునా చెట్లు ఉన్నందున వాటి తరలింపు అనేది అనివార్యమవుతున్నది. ఈ క్రమంలో అధికారులు 150 చెట్ల వరకు అక్కడి నుంచి తరలించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు చెట్ల పరిరక్షణ కమిటీ క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలన చేసి… ఇక్కడ తొలగించిన చెట్లను తిరిగి సంజీవయ్య పార్కులో నాటేలా సూచనలు చేశారు. గతంలో చేవెళ్ల ప్రాంతంలో రహదారి విస్తరణ, అవుటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు, మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనూ చెట్లను తొలగించాల్సి వచ్చినప్పుడు చెట్ల పరిరక్షణ కమిటీలే కీలక పాత్ర పోషించి.. తిరిగి వాటికి పునర్జీవనం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని చెట్లను తిరిగి నాటారు. చెట్లను సంరక్షించేందుకు నిబంధనల ప్రకారం తరలింపు ప్రక్రియను చేపడుతున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.