ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 6 : కొరియర్ ఏజెన్సీ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి డార్క్నెట్లో వ్యాపారం చేస్తున్న ఓ నిందితుడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం… దమ్మాయిగూడ మున్సిపాలిటీ సిద్ధార్థనగర్ కాలనీలోని ఓ ఇంట్లో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు, జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా దాడులు జరిపారు.
నిందితుడు ఆర్.అనిరుధ్ (24)ను అదుపులోకి తీసుకొని అతడి వద్ద నుంచి రూ.3.5 లక్షల విలువగల 78 ఎల్ఎస్డీ పేపర్ బ్లాట్స్, 0.702 మిల్లీ గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 150 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా కొరియర్ ఏజెంట్ల ద్వారా డ్రగ్స్ను కొనుగోలు చేసి డార్క్నెట్ ద్వారా వ్యాపారం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. దాడుల్లో ఇన్స్పెక్టర్ మల్లయ్యతో పాటు డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు పురుషోత్తం రెడ్డి, శ్రావణి, ధన్రాజ్, సిబ్బంది పాల్గొన్నారు. అయితే నిందితుడు 2022 జనవరి నెలలో తిరుమలగిరిలో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడి జైలుకు వెళ్లివచ్చినట్లు సమాచారం.