కేబుల్ బ్రిడ్జిపై వేగ పరిమితి 30 నుంచి 35 కిలోమీటర్లు. ఇంతకుమించి వెళ్లొద్దని ట్రాఫిక్ పోలీసులు పలుచోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా ఉల్లంఘించి అతివేగం (ఓవర్స్పీడ్)తో వెళ్లిన వాహనాలకు ఏడాదిలోనే రూ.వెయ్యి చొప్పున 7463 చలానాలు జారీచేశారు.
మహానగరానికి ఐకాన్గా, అద్భుత పర్యాటక కేంద్రంగా ఖ్యాతిపొందిన మాదాపూర్లోని దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన (కేబుల్ బ్రిడ్జి) కొందరి అతిచేష్టల వల్ల ప్రమాదాలకు కేరాఫ్గా మారుతోంది. వినోదం పేరుతో యువత రోడ్డు మధ్యన సెల్ఫీలు దిగడం, బర్త్డేలు చేసుకోవడం, మద్యం మత్తులో చిందులు వేయడం వాహనాల రాకపోకలకు సంకటంగా తయారవుతోంది. ప్రధానంగా అర్ధరాత్రి దాటిన తర్వాత రేసింగ్లు, వాహనాల అతివేగంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వంతెన రెయిలింగ్ పైకెక్కి సెల్ఫీలు తీసుకోవడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇతరులను ప్రేరేపిస్తున్నారు. తీగల వంతెనపై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 115 కేసులు నమోదు చేశారు.
సిటీబ్యూరో, సెప్టెంబరు 14 (నమస్తే తెలంగాణ): కేబుల్ బ్రిడ్జి.. జూబ్లీహిల్స్ నుంచి సైబరాబాద్ ఐటీ కారిడార్కు వెళ్లే వారి సౌకర్యార్థం ప్రభుత్వం నిర్మించిన వారధి. నిర్మాణ తీరుతో దేశవ్యాప్తంగా పేరు గాంచిన ఈ బ్రిడ్జిని ఎంతోమంది ఉద్యోగులు, సామాన్యులు వినియోగించుకుంటూ ప్రభుత్వం చేసిన ఈ గొప్ప కార్యాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే కొంతమంది పోకిరీలు వినోదం కోసం చేస్తున్న విన్యాసాలు ఇతర వాహనదారులకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. అయితే ఈ బ్రిడ్జిపై 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని నిర్ణయించిన అధికారులు వేగ నియంత్రణ కోసం పలు చోట్ల కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నిర్దేశించిన వేగానికి మించి ఎవరు వెళ్లినా చలాన్లు జారీ చేస్తున్నారు.
కొందరు పోకిరీలు నిబంధనలకు విరుద్ధంగా కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. జల్సాలు చేస్తూ విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. కేక్ కట్టింగ్లు, బైక్లతో స్టంట్లు, సెల్ఫీలకు ఫోజులు, మద్యం మత్తులో చిందేస్తున్నారు. మొత్తంగా ఈ బ్రిడ్జిని వినోదాల చౌరస్తాగా మార్చేస్తున్నారు. ఇంకా ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. అయితే కేబుల్ బ్రిడ్జిపై ఇవన్నీ నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు 115 కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్తో పాటు పెట్టీ కేసులు నమోదు చేశారు. ఇందులో కేక్లు కట్ చేస్తూ ఇతర వాహనదారులకు అసౌకర్యం కల్పించిన ఐదుగురు.. బైక్ విన్యాసాలు చేసిన ఒకరు.. బ్రిడ్జిపై నృత్యం చేసినందుకు మరొకరు.. సెల్ఫీలు దిగిన 45 మంది.. ఇతర కార్యక్రమాలకు పాల్పడిన 63 మందిపై కేసులు పెట్టి కోర్టులో హాజరు పరిచి శిక్షలు అమలు చేస్తున్నారు.
రాయదుర్గం కేబుల్ బ్రిడ్జిపై 30 నుంచి 35 కిలోమీటర్ల వేగాన్ని మించొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కేబుల్ నిర్మాణం, రోడ్డు తీరును అనుసరించి జీహెచ్ఎంసీ అధికారులు ఈ వేగాన్ని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పరిమితికి మించి వేగంగా ప్రయాణించే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్లు జారీ చేస్తున్నారు. అంతేకాక మొత్తం 37 ఉల్లంఘనలపై దృష్టి సారించిన పోలీసులు బ్రిడ్జి ప్రారంభమైన ఏడాది కాలంలో 7463 చలాన్లు జారీ చేశారు. ఇందులో అత్యధికంగా (4492) ప్రమాదకర స్థితిలో వాహనాలు నిలిపిన ఘనటలో జారీ అయినవే ఎక్కువగా ఉన్నాయి.
రవాణా సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జిపై విన్యాసాలు వద్దు. బ్రిడ్జి అందాలను మాత్రమే తిలకించేందుకు ఇక్కడికి రావాలి. ఎవరైనా వెకిలి చేష్టలు చేస్తే నిఘా కెమెరాలు రికార్డు చేస్తాయి. తీవ్రతను బట్టి కేసులు నమోదు అవుతాయి. ఇప్పటి వరకు 115 మందిపై కేసులు నమోదు చేశాం. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న వారిపై చలాన్లు జారీ చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవు. -వెంకటేశ్వర్లు, మాదాపూర్ డీసీపీ