ముషీరాబాద్, నవంబర్ 4: కోటి దీపోత్సవంలో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఇంద్రకీలాద్రి శ్రీ గంగా, దుర్గా మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. రచన టెలివిజన్ అధినేత, కోటి దీపోత్సవ నిర్వాహకులు తుమ్మల నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతుల నేతృత్వంలో ఇంద్రకీలాద్రి ఆలయ అర్చక బృందంతో అమ్మవారికి కోటి గాజుల అర్చన వైభవంగా నిర్వహించారు.
కోటి దీపోత్సవ ప్రాంగణంలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఊరేగింపు, ఇంద్రకీలాద్రి ఉత్సవమూర్తులకు సింహవాహన సేవ కన్నుల పండువగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, యోగదా సత్సంగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు శ్రీస్మరణానందగిరిస్వామి, శ్రీ సర్వవిద్యానందగిరి స్వామి, మహాబోధి బుద్ధవిహార్ శ్రీవెనరెబుల్ చిక్కు సంఘపాల పాల్గొన్నారు. అంతకుముందు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు భక్తి ప్రవచనాలు చేశారు.