సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ఉత్తర దక్షిణ ద్రోణి, కింది స్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆది, సోమవారం వడగండ్లతో కూడిన వర్షాలు పడుతాయని ప్రకటించింది. దీంతో గ్రేటర్ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. అత్యధికంగా హియాయత్నగర్లో 7.88 సె.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వర్షంతో కళాసిగూడలో నాలాలో మౌనిక(11) అనే బాలిక కొట్టుకుపోయి మృతి చెందింది. లోతట్టు ప్రాంతాలు ప్రస్తుత వర్షాలతో జలమయం అయ్యాయి. ఈ వర్షాలకు ఇబ్బందులు తలెత్తకుండా డీఆర్ఎఫ్, బల్దియా, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు.