మేడ్చల్, డిసెంబర్ 11: అద్దె చెల్లించలేదని మేడ్చల్ ఈఎస్ఐ డిస్పెన్సరీకి భవన యజమాని తాళం వేయడంతో రోగులు, ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. దాదాపు మూడు వారాలుగా డిస్పెన్సరీ రోగులకు వైద్యం సేవలందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేడ్చల్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ వినాయక్నగర్ రోడ్ నంబర్ 2లోని అద్దె భవనంలో కొనసాగుతున్నది. 2022 సెప్టెంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి అద్దె రూ.53,604 యజమానికి ఖాతాలో జమ కాలేదు. ఆ తర్వాత నెలలు 2023 జనవరి, ఫిబ్రవరి నెలల అద్దె ఖాతాలో జమ అయింది.
ఆ తర్వాత యజమాని రెన్యూవల్ చేసుకోకపోవడంతో అద్దె రాలేదు. యజమాని గత ఏడాదికి సంబంధించిన రెండు నెలల అద్దె రాకపోవడంతో రెన్యూవల్ చేసుకోవడం లేదు. ఆ అద్దె కోసం ఎదురు చూస్తూ నవంబర్ నెల వరకు వేచి చూశాడు. దీంతో విసిగిపోయిన యజమానికి గత నెల 22న డిస్పెన్సరీకి తాళం వేశాడు. అప్పటి నుంచి తాళం తెరవనివ్వడం లేదు. ప్రతి రోజూ 120 నుంచి 150 మంది వరకు మేడ్చల్ డిస్పెన్సరీ వైద్య సేవలు అందిసున్నది. ప్రతి రోజూ మేడ్చల్కు వైద్యం కోసం వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారు.
‘యజమానికి అద్దె రావాల్సిన విషయాన్ని, తాళం వేయడంతో పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గత ఏడాదిలో రావాల్సిన రెండు నెలల అద్దెకు సంబంధించిన పత్రాలను సమర్పించాం. యజమాని కూడా మానవతా ధృక్పథంతో స్పందించాలి’. అని డిస్పెన్సరీ వైద్యుడు చంద్రశేఖర్ తెలిపారు.