మత్తు మూలాలు.. కూకటివేళ్లతో పెకిలించిన ‘హెచ్న్యూ’
పది రాష్ర్టాల లింక్ కట్.. స్మగ్లింగ్ దందాకు చెక్
ఆపరేషన్ ‘ఎల్పీ’తో ఆటకట్టు
సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): మొట్టమొదటి సారిగా హైదరాబాద్ పోలీసులు సమూలంగా మాదకద్రవ్యాల నెట్ వర్క్ను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో 10 రాష్ర్టాలకు సరఫరా అవుతున్న గంజాయి, హాష్ ఆయిల్ నిలిచిపోయింది. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సారథ్యంలో ఏర్పాటైన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్న్యూ) ప్రత్యేక కార్యాచరణను చేపట్టి.. మత్తు మూలాలను పెకిలించింది. ఇటీవల గంజాయి, ఇతర డ్రగ్స్కు అలవాటైన అశోక్నగర్కు చెందిన బీటెక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న హెచ్న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మి బృందం ఇన్స్పెక్టర్ రాజేశ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ‘ఎల్పీ’ని చేపట్టింది. వారం రోజుల పాటు సుదీర్ఘంగా పనిచేసి హైదరాబాద్ టు అరకు, అరకు నుంచి 10 రాష్ర్టాలకు ఉన్న డ్రగ్స్ నెట్వర్క్ లింక్ను పోలీసులు ఈ కింది విధంగా ఛేదించారు.
ర్యాపిడో రైడ్లో గంజాయి.. లక్ష్మీపతి ైస్టెల్ ఇది..
ఎవరికీ అనుమానం రాకుండా.. ర్యాపిడో బుక్ చేసి డ్రగ్స్ను సరఫరా చేయడం లక్ష్మీపతి ైస్టెల్. ఇంజినీరింగ్ చదువులను మధ్యలోనే ఆపేసిన ఇతడు..సులువుగా డబ్బులు సంపాదించేందుకు మాదకద్రవ్యాల దందా మొదలుపెట్టాడు. అరకుకు చెందిన నగేశ్ నెట్వర్క్లోకి ఎంట్రీ అయ్యాడు. తాను తక్కువకు కొని, హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువ ధరకు డ్రగ్స్ పెడ్లర్లకు విక్రయిస్తున్నాడు. తన వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసే వారి ద్వారా ర్యాపిడో బుక్ చేయిస్తాడు. తాను వాహనంపై రాలేకపోతున్నానని, ఫలానా చోటకు వెళ్లి అక్కడున్న వారికి పార్సిల్ అప్పగిస్తే సరిపోతుందని చెబుతాడు. దీంతో ర్యాపిడో బుక్చేసుకున్న వాళ్లు కూడా అనుమానించరు.
గంజాయి కావాలంటూ.. ఫోన్ చేయించి..
బంజారాహిల్స్, ఏప్రిల్ 6: గంజాయి ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని గజపతి జిల్లా పారాలక్తెముండి గ్రామానికి చెందిన తేల్పుల కిరణ్కుమార్(22) మాదాపూర్ సమీపంలోని పర్వత్నగర్లో నివాసముంటున్నాడు. ఒడిశాలో గంజాయి కొని.. నగరంలో అమ్ముతున్నాడు. రెండ్రోజుల కిందట యూసుఫ్గూడలో ఉండే కేపీ సిద్దార్థ్(24), ఎర్రమంజిల్ కాలనీకి చెందిన దీపక్కుమార్(32) అనే బ్యాడ్మింటన్ కోచ్, ఖైరతాబాద్కు చెందిన అనిరుధ్ కట్ల(21)లకు విక్రయించగా, ఈ ముగ్గురు అవసరమైన వారికి గంజాయిని అమ్ముతున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోగా, తాము కిరణ్ వద్ద సరుకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. వారితోనే గంజాయి కావాలంటూ..కిరణ్కు ఫోన్ చేయించి.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 36లోని నీరూస్ చౌరస్తా వద్ద పట్టుకున్నారు. అతడి గదిలో 9కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హాష్ ఆయిల్ విక్రేతలు..
9 మంది వినియోగదారులు అరెస్ట్
హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ఇద్దరు డ్రగ్స్ విక్రేతలతో పాటు తొమ్మిది మంది వినియోగదారులను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్న్యూ) అరెస్ట్ చేసింది. నల్లకుంట పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మి వివరాలను వెల్లడించారు. నాచారానికి చెందిన ఎం.మదన్, చర్లపల్లికి చెందిన స్క్రాప్ వ్యాపారి ఎన్.రాజు స్నేహితులు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న వీరు.. వైజాగ్లో బుజ్జిబాబు వద్ద కిలో హాష్ ఆయిల్ను రూ. 60 వేలకు కొని.. నగరంలో ఐదు గ్రాములు బాటిళ్ల రూపంలో ఒక్కొక్కటీ రూ. 3వేలకు అమ్ముతున్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎర్రకుంటలో మదన్, రాజు సరుకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారణలో తమ వద్ద 18 మంది హాష్ ఆయిల్ కొంటారని వెల్లడించడంతో వారిలో 9 మంది వినియోగదారులను అరెస్టు చేశారు. అరెస్టయిన వినియోగదారుల్లో జి.త్రివిక్రమ్రెడ్డి, పవన్ చంద్, ఎం.కార్తిక్, భానుప్రకాశ్, ఎస్.రాజశేఖర్, కె.షడ్చ్,్ర రవీంద్రనాథ్ రాహుల్, సంజు, సాయికిరణ్ ఉన్నారు.
ఆఫ్టర్ పార్టీ.. మత్తు కిక్..
పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరం
సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతున్నది. ఆఫ్టర్ పార్టీలోనే డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ర్యాడిసన్ బ్లూ హోటల్లో 24 గంటలు బారు నడిచేందుకు అనుమతి ఉండడంతో దానిని అడ్డు పెట్టుకొని పుడింగ్ అండ్ మింక్ పబ్ నిర్వాహకులు అర్ధరాత్రి ఒంటి గంట తరువాత ఆఫ్టర్ పార్టీ పేరుతో కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇలా లేట్ ఆవర్స్లో జరిగిన పార్టీలో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఆ రోజు పార్టీకి హాజరైన వారి జాబితాను విశ్లేషిస్తూ, కొత్తవారు ఎవరు..పాతవారెవరు అనే విషయంపై ఆరా తీస్తున్నారు.