సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): నగరంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.5లక్షల విలువ చేసే 73 ఎక్స్టసీ మాత్రలు, 17గ్రాముల కొకైన్, 8గ్రాముల ఎండీఎంఏ, 15 గ్రాముల చరస్తో పాటు రూ.80వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆబ్కారీ జాయింట్ కమిషనర్ అజయ్రావు, హైదరాబాద్ జిల్లా ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ నంద్యాల అంజిరెడ్డి వివరాలు వెల్లడించారు.
యెమన్ దేశానికి చెందిన అబ్దురబు మహ్మద్(31) చదువు కోసం 2010లో ఇండియాకు వచ్చి, పుణేలోని ఓ కళాశాలలో డిగ్రీ చదివి మధ్యలోనే ఆపేశాడు. తిరిగి 2013లో హైదరాబాద్లోని నిజాం కాలేజీలో బీసీఏ కోర్సులో చేరి..అక్కడ కూడా అర్ధంతరంగానే ఆపేశాడు. ఈ క్రమంలో డ్రగ్స్కు అలవాటు పడి, డ్రగ్స్ విక్రయాలు మొదలు పెట్టాడు. 2019 డిసెంబర్లో స్నేహితులకు డ్రగ్స్ విక్రయిస్తూ ఆబ్కారీ అధికారులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు.. జైలు నుంచి విడుదలైన తరువాత నగరం నుంచి తన మకాంను బెంగుళూరుకు మార్చాడు. ముంబైలో నివాసముంటున్న నైజీరియన్కు చెందిన ఎజా చిడి(38) వద్ద కొకైన్, చరస్ను, బెంగళూరులో ఉంటున్న విక్టర్ నుంచి ఎస్టసీ, ఎండీఎంఏను కొనుగోలు చేసి.. హైదరాబాద్లో విక్రయాల కోసం బంజారాహిల్స్ రోడ్ నం.10, నూర్నగర్లో ఒక ఇల్లును అద్దెకు తీసుకున్నాడు.
ఈ క్రమం లో ముంబై, బెంగళూరు నుంచి 73ఎక్స్టసీ మాత్రలు, 17గ్రాముల కొకైన్, 8గ్రాముల ఎండీఎంఏ, 15గ్రాముల చరస్ను నగరానికి తీసుకువచ్చి, సికింద్రాబాద్, బాలంరాయి ప్రాంతానికి చెందిన సాలమన్ సాయిరాజ్తో కలిసి విక్రయించేందుకు యత్నిస్తున్నాడు. సమాచారం అందుకున్న హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నూర్నగర్లోని నిందితుడి నివాసంపై దాడి చేసి అబ్దురబు, సాలమన్ సాయిరాజ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5లక్షల విలువ చేసే డ్రగ్స్, నగదును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును అమీర్పేట ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.
ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ నంద్యాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్ఐ నజీర్ హుస్సేన్, హెడ్ కానిస్టేబుళ్లు భాస్కర్రెడ్డి, అజీమ్, శ్రీధర్, కానిస్టేబుళ్లు వెంకటకృష్ణ, స్రవంతి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.