యువతకు మరణశాసనంగా మాదకద్రవ్యాలు
సరదాగా అలవాటై చివరకు బానిస
నాడీవ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం
పొంచివున్న మల్టీఫుల్ స్లెరోసిస్ ముప్పు
యువతకు మరణశాసనంగా మాదకద్రవ్యాలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 3 : డ్రగ్స్.. యువతను జీవితాన్ని నిలువెల్లా నాశనం చేస్తోంది. సరదాగా అలవాటు చేసుకొని చివరకు మత్తు పదార్థాలు లేకుండా ఉండలేని పరిస్థితికి వస్తున్నారు. మత్తు మైకంలో చదువుకు దూరమవుతూ విలువైన శక్తిని నిర్వీర్యం చేసుకుంటున్నారు. డ్రగ్స్ తరచుగా తీసుకోవడం వల్ల ప్రధానంగా నాడీ వ్యవస్థను దెబ్బతీయడంతోపాటు మెదడు, గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిమ్స్ న్యూరాలజి వైద్యనిపుణులు. దీనివల్లే ఇటీవల ఇంజినీరింగ్ విద్యార్థి మృత్యువాతపడినట్లు చెబుతున్నారు. ఇదే బీటెక్ విద్యార్థి తొలి మరణంగా వైద్యులు చెబుతున్నారు. గతంలో ఈ మత్తు పదార్థాల మైకంలో కొందరు యువకులు నేరాలకు ఒడిగట్టిన ఘటనలున్నాయి.
గంజాయి మత్తులో యువకుడు సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. నిందితులు తీసుకున్న మత్తు పదార్థాలు వేర్వేరయినా దానివల్ల డ్రగ్స్ వినియోగదారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండడమే కాకుండా సమాజానికి, నిందితుల కుటుంబసభ్యులకు తీవ్ర ముప్పు కలిగిస్తున్నాయి. గంజాయి, కొకైన్, బ్రౌన్షుగర్, ఎండీఎం బ్లాస్ట్లు, హాశిష్ తైలం, తదితర డ్రగ్స్ అన్నీ యువతను పెడదారి పట్టిస్తున్నవే.
డ్రగ్స్ వినియోగంతో మల్టీపుల్ స్లేరోసిస్ ముప్పు
డ్రగ్స్కు అలవాటుపడిన వారిలో అధికంగా ‘మల్టీపుల్ స్లేరోసిస్’ ముప్పు పొంచి ఉంటుందంటున్నారు వైద్యులు. డ్రగ్స్ నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడం వల్ల మల్టీపుల్ స్లేరోసిస్ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారు. ప్రధానంగా రెండు ప్రధాన అవయవాలు మెదడు,వెన్నుపాము దెబ్బతింటాయని, నాడీవ్యవస్థపై పనిచేసే స్వయం రోగ నిరోధకశక్తిని మత్తు పదార్ధాలు దెబ్బతీస్తాయిని.. ఫలితంగా నాడీ వ్యవస్థను కాపాడే రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని ఉస్మానియా న్యూరో వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీనివాస్ వివరించారు. నాడీ వ్యవస్థను రక్షించే రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల పలురకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలుంటాయని వివరించారు. మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారిలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తుందని చెప్పారు. మల్టీపుల్ స్లేరోసిస్ నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధి కావడంతో దీని ప్రభావం మెదడు, వెన్నుపాముతో పాటు శరీరంలోని అన్ని ప్రధాన అవయవాలపై ఉంటుందని ఆయన వెల్లడించారు.
కణాల విద్యుత్ ప్రేరణ ప్రసార సామర్థ్యం తగ్గిపోతుంది
మత్తుపదార్థాలు నాడీవ్యవస్థపై ప్రభావం చూపడంతో మెదడు పనితీరు బాగా దెబ్బతింటుంది. ముఖ్యంగా నరాల ఫైబర్ (నరాల కణంలో దారంపోగులా ఉండే భాగం) చుట్టూ ఉండే ఫాట్షీత్కు నష్టం కలిగిస్తాయి. దీనివల్ల కణాలకు విద్యుత్ ప్రేరణ ప్రసార సామర్థ్యం(ఎలక్ట్రికల్ ఇంపలెన్స్) తగ్గి నరాలు పూర్తిగా దెబ్బతింటాయి.
డ్రగ్స్ బారినపడితే లక్షణాలు
కాళ్లు చేతులు వణకడం, తీవ్రమైన తలనొప్పి, నోరు ఎండిపోవడం, కళ్లు ఎర్రబడడం, పర్సనాలిటీ డిజార్డర్ వస్తుంది. విపరీతమైన కోపం. అతిక్రూరుడిలా మార్పు, నెగిటివ్ శక్తుల పట్ల ఆకర్షణ, కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. సహనం, ఓపిక తగ్గిపోతాయి. కోపం, అసహనం పెరుగుతాయి.
పిల్లలను ఓ కంట కనిపెట్టండి
మత్తు ఎలాంటిదైనా ప్రాణాంతకమే
ఒక్కో డ్రగ్ ఒకోవిధంగా ప్రభావం చూపుతుంది. కొన్నింటి వల్ల గుండెపోటు, బ్రెయిన్స్ట్రోక్ వస్తుంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపడం వల్ల శ్వాస సమస్య ఏర్పడుతుంది. డ్రగ్స్ ప్రధానంగా కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీంతో శరీరంలోని అన్ని ప్రధానావయవాలు దెబ్బతిని విఫలమవడంతో మృతిచెందే ప్రమాదముంది. యువత డ్రగ్స్ జోలికెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. డ్రగ్స్ వల్ల ఇంజినీరింగ్ విద్యార్థి మరణించడం ఇదే తొలిసారి. ఒక విద్యార్థికి ఇన్ని రకాల డ్రగ్స్ లభించడం, వాటిని ఒకేసారి తీసుకోవడంతోపాటు మద్యం సేవించడం తెలుసుకొని షాక్ అయ్యాం.
– డాక్టర్ రుక్మిణి, న్యూరో వైద్యనిపుణులు, నిమ్స్ హాస్పిటల్
డీ-ఎడిక్షన్ చికిత్స ద్వారా సాధారణస్థితికి..
ప్రారంభ, మధ్యస్థ, తీవ్ర..ఏ వ్యసనానికైనా ఈ మూడు దశలు ఉంటాయి. మత్తుకు బానిసలైన మూడు దశలవారిని కూడా డీ-ఎడిక్షన్ చికిత్స ద్వారా సాధారణ స్థితికి తేవొచ్చు. ఈ చికిత్స అందించేందుకు ‘రిహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నాయి. తొలి రెండు దశల్లో బాధితులను 8 నుంచి 10 రోజుల్లో విత్డ్రాయల్ లక్షణాల నుంచి బయటపడేయవచ్చు. తీవ్రదశలోని రోగిని 10 నుంచి 15 రోజుల్లో ఆ వలయం నుంచి తప్పించవచ్చు. ఆ తర్వాత మత్తు పదార్థాలు తీసుకున్నా కిక్కు రాకుండా, అసలు తీసుకోవాలనే కోరికే పుట్టకుండా ‘వాల్ప్రోయిక్ ఆసిడ్’, ‘నల్ట్రేగ్జాన్’, ‘బ్యూప్రోపియాన్,‘టాపిరమేట్’ వంటి మందులు ఇస్తారు. ఇలాంటి ఔషధాలను రోగి ఆరోగ్య స్థితి ఆధారంగా కనీసం 3నెలలు వాడాల్సి ఉంటుంది. వారానికి ఒకరోజు కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. డీ-ఎడిక్షన్ చికిత్స తర్వాత మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నది అపోహే.
– డాక్టర్ కృష్ణసాహితీ, సైకియాట్రిస్ట్
మత్తు తీసుకుంటే ఆరోగ్యం చిత్తు
డ్రగ్స్పై ఓ చిన్నారి అవగాహన
మత్తు పదార్థాలు తీసుకుంటే..మనిషి ఆరోగ్యం చిత్తు, డ్రగ్స్కు బానిస కావొద్దంటూ ఫౌండేషన్ ఫర్ ఏ డ్రగ్ ఫ్రీ వరల్డ్ జూనియర్ క్యాంపెయింగ్ హెడ్ తనియాబేగం ఆదివారం నగరంలో పలుచోట్ల అవగాహన కల్పించింది. డ్రగ్స్ తీసుకుంటే కలిగే దుష్ర్పరిణామాలు, ప్రవర్తన, ఆరోగ్యంపై ప్రభావం, మత్తుకు బానిసైన వారు మానడానికి పడుతున్న ఇబ్బందులతో కూడిన కరపత్రాలు, బుక్లెట్లను క్యాబ్డ్రైవర్లకు పంపిణీ చేసింది. క్యాబ్ ప్రయాణంలో ఉన్నవారు డ్రగ్స్పై అవగాహన ఉండాలనే వీటిని పంచినట్లు తెలిపింది