హైదరాబాద్ : సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్లో నిన్న ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు, అధికారులు కలిసి డ్రోన్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలను రెండో అంతస్తులో డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, అగ్నికీలల్లో చిక్కుకుపోయిన కార్మికులు గుజరాత్కు చెందిన జునైద్ (25), జహీర్ (22), వసీం (32) అని స్థానికులు తెలిపారు. ఈ ముగ్గురి సెల్ఫోన్ లొకేషన్ కూడా అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్లోనే ఉన్నట్లు నిర్ధారించారు. జీహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్ పోలీసులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
అయితే డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్కు సమీపంలోని స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ పొగకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అగ్ని ప్రమాదం ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలానికి వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్ను పరిశీలిస్తున్నారు. పొగ దట్టంగా కమ్మేయడం, వేడి కారణంగా లోపలకు వెళ్లడం కష్టంగా మారింది. బిల్డింగ్లో ఐరన్ ర్యాక్లు ఏర్పాటు చేసి టాన్ల కొద్దీ బట్టలను నిల్వచేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఫ్యాబ్రిక్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నారు. మరోవైపు గంటల తరబడి మంటలు కొనసాగడంతో భవనం పటిష్టతపై అనుమానాలు నెలకొన్నాయి. టెక్నికల్ టీం, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ భవనాన్ని పరిశీలించిన అనంతరం కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటారని అధికారులు పేర్కొంటున్నారు. మంటలు వ్యాపించిన భవనంతో పాటు చుట్టుపక్కల ఉన్న భవనాల పటిష్టతను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు.