సిటీబ్యూరో: మహానగరంలో డ్రైవింగ్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాస్తవానికి డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే రవాణా శాఖ అనుమతి తప్పనిసరి. కానీ సుమారు 60 శాతం డ్రైవింగ్ స్కూళ్లు అనుమతులు లేకుండానే వ్యాపారం చేస్తున్నాయి. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పదుల సంఖ్యలో డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. అక్కడసిమ్యులేటర్లు ఉండవు. థియరీ క్లాసుల జోలికే వెళ్లరు. రెండు, మూడు సూచనలు చేసి వాహనం చేతికిస్తున్నారు.
మైదానంలో పది రోజుల పాటు నేర్పించి శిక్షణ పూర్తయిందంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో దళారులు, అధికారులతో ఉన్న సంబంధాలతో లైసెన్సూ ఇప్పించేస్తున్నారు. ఒక్కో వాహనదారుడి నుంచి రూ.5-6వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో సరైన శిక్షణ లేకుండానే చాలా మంది అరకొర శిక్షణతో బయటకొస్తున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్, బండ్లగూడ, మణికొండ, కూకట్పల్లి తదితర కార్యాలయాల పరిధిలో అనుమతి లేని స్కూళ్లు కొనసాగుతున్నాయి.