వెంగళరావునగర్, ఫిబ్రవరి 17 : నమ్మకంగా ఉంటూ.. డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రూ.7 కోట్ల విలువజేసే ఆభరణాలతో ఉడాయించాడు. ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్లోని మై హోం భోజ అపార్ట్మెంట్స్లో నివాసముండే రాధిక నగల వ్యాపారి. వజ్రాభరణాలను ప్రముఖ నగల దుకాణాల నుంచి సేకరించి సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో రాధిక నివాసముంటున్న అపార్ట్మెంట్లోనే ఉంటున్న అనూష రూ.50లక్షల విలువైన ఆభరణాల కోసం ఆర్డర్ చేశారు.
అనూష శుక్రవారం సాయంత్రం మధురానగర్లోని బంధువుల ఇంట్లో ఉన్నారు. తాను ఆర్డర్ చేసిన నగలను మధురానగర్కు పంపించాలని చెప్పడంతో.. రాధిక తన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస్, సేల్స్మన్ అక్షయ్ (30)తో వజ్రాభరణాలను పంపించారు. అక్కడికి వెళ్లిన సేల్స్మన్ కారు దిగగానే.. డ్రైవర్ శ్రీనివాస్ కారుతో ఉడాయించాడు. ఆ కారులో ఏడు కోట్ల విలువజేసే ఆభరణాలు ఉన్నాయని, వాటిని పంజాగుట్టలోని నగల దుకాణంలో ఇవ్వాల్సి ఉందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.