సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి పథకం ఫేజ్-3లోని కోదండపూర్ పంపింగ్ స్టేషన్ వద్దనున్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ హైడర్ పైపులైన్కు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ నెల 13 (బుధవారం) ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు గురువారం ఉదయం 5 గంటల వరకు ఈ మరమ్మతు పనులు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ 24 గంటల పాటు పలు రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.
శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్పేట్, ఆళ్లబండ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా, లాలాపేట్ పాక్షిక ప్రాంతా లు, సాహేబ్ నగర్, ఆటోనగర్, సరూర్నగర్, వాసవి రిజర్వాయర్, సైనిక్పురి, మౌలాలి, స్నేహపురి కాలనీ, కైలాసగిరి, దేవేంద్రనగర్, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సోసైటీ, కావురి హిల్స్, మధుబన్, దుర్గానగర్ , బుద్వేల్, సులేమా నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్పూర్, గంధంగూడ, బోడుప్పల్, మల్లికార్జున నగర్, మాణిక్ చంద్, చెంగిచర్ల, భరత్నగర్, పీర్జాదిగూడ, ధర్మసాయి రిజర్వాయర్ పరిధిలో నీటి సరఫరా ఉండదని అధికారులు పేర్కొన్నారు. ఈ స్వల్ప అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.