శామీర్ పేట్, మే 8 : నెల రోజుల నుంచి తాగునీళ్లు రావడం లేదని ఇందిరమ్మ కాలనీ వాసులు గురువారం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. నల్లా నీళ్లు రాకపోవడంతో ట్యాంకర్ల నీళ్లు కొనలేక పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం లాల్ గడి మలక్ పేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వం, అధికారుల పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
లాల్గడి మలక్ పేట్ గ్రామంలోనే నీటి సమస్య ఎందుకు వస్తుందని పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామంలో నీటి సమస్య తలెత్తుతుందని కాలనీ వాసులు తెలిపారు. నెల రోజులుగా ఇందిరమ్మ ఇళ్ల కాలనీకి నీటి సమస్య ఉందన్నారు.
సమస్యను వివరిస్తే కాలనీ మొత్తానికి ట్యాంకర్ను పంపి చేతులు దులుపు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు, ట్యాక్స్లు కట్టకపోతే నల్లా కనెక్షన్ లు కట్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తారని, నీరు సరిగా రావడం లేదని ఫిర్యాదు చేస్తే పట్టించుకునే వారే లేరని వాపోయారు. కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి రావాల్సిన నీళ్లు సరిగా రావడం లేదని, వచ్చిన నీళ్లనే సర్దుబాటు చేస్తున్నామని చెప్పడంతో నిరసన విరమించారు.