తెలుగుయూనివర్సిటీ, మే 4: దయార్థ్ర హృదయం గలవారే కళాకారులకు సాయం చేయగలరని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జానపద కళాకారులకు నగదు పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఏసీ గార్డ్స్ – నఫీస్ రెసిడెన్సీలోని రమణాచారి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఈ కార్యక్రమం చోటు చేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వందమంది కళాకారులకు లక్ష రూపాయల నగదును రమణాచారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ స్ఫూర్తితో మరింత మంది కళాకారులను ఆదుకునేందుకు కరోనా విపత్కర పరిస్థితిలో ముందుకు రావాలని రమణాచారి ఆకాంక్షించారు.
సాయం చేయడం దేవుడిచ్చిన వరంగా భావించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన యువ కళావాహిని అధ్యక్షులు వైకే నాగేశ్వరరావుకు సభ సంతాపం తెలిపింది. వైకే లేని లోటు తీరదని ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని కార్యవర్గ సభ్యులకు రమణాచారి సూచించారు. కార్యక్రమంలో కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ, యువ కళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు బొప్పన నరసింహారావు, జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.