‘నిరుపేదలు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండాలనే ఆధునిక వసతులతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నాం. నాణ్యతలో రాజీ లేకుండా కట్టిస్తున్నాం. ప్రగతిభవన్లో వాడే లిఫ్ట్లను డబుల్ ఇండ్లల్లో ఏర్పాటు చేస్తున్నం. ఇచ్చిన ఇండ్లను శుభ్రంగా ఉంచండి. కిరికిరిలు పెట్టుకొని పరిసరాలను ఆగం చేయ్యొద్దు. ఇండ్లు ఇప్పిస్తామని పైరవీకారులు తిరుగుతుండ్రు. ఎవరికీ పైసా ఇయ్యకండి. బహిరంగ మార్కెట్లో లక్షలు విలువజేసే ఇండ్లను బహుమతిగా ఇస్తున్నాం. ప్రభుత్వం వద్ద జాబితా ఉంది. లాటరీ పద్ధతిన అర్హులకు కచ్చితంగా ఇండ్లు దక్కుతాయి. గ్రేటర్లో లక్ష ఇండ్ల లక్ష్యానికి చేరువలో ఉన్నాం. స్వల్ప పనులు మినహా మరో 70 వేలు ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మలక్పేట నియోజకవర్గం ఛావుని డివిజన్లో రూ.29.41 కోట్ల వ్యయంతో నిర్మించిన 288 పిల్లిగుడిసెల డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని శనివారం హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, దానం నాగేందర్తో కలిసి మంత్రి ప్రారంభించారు.
సైదాబాద్/చాదర్ఘాట్/మాదన్నపేట్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ‘మనిషి ఇటు నుంచి అటు వెళ్లేందుకు జాగా ఉండదు.. నిత్యం మంచినీళ్ల గోసే.. డ్రైనేజీ ఇబ్బందులు.. మీరంతా ఇన్నాళ్లూ ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇప్పుడా బాధలు లేవు. ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో ఉన్న గుడిసెలు.. ఇప్పటి డబుల్ బెడ్రూం ఇండ్లను చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రైవేటు బిల్డర్ కట్టి ఉంటే ఒక్కోటి రూ.50-60 లక్షల ధర పలికేవన్నారు. ఇలాంటి ఇండ్లను నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా తెలంగాణ ప్రభుత్వం బహుమతిగా ఇస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఉండే ప్రగతిభవన్లో వాడిన షిండ్లేర్ కంపెనీ లిఫ్టును పిల్లిగుడిసెల డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో ఏర్పాటు చేశామన్నారు. ఇండ్ల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతతో కడుతున్నామనేందుకు ఈ పిల్లి గుడిసెల డబుల్ బెడ్రూం గృహ సముదాయమే నిదర్శనమని స్పష్టం చేశారు. శనివారం మలక్పేట నియోజకవర్గం ఛావుని డివిజన్లో రూ.29.41 కోట్ల వ్యయంతో నిర్మించిన 288 పిల్లిగుడిసెల డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో కలిసి వాటిని ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిరుపేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో రూ.9,700 కోట్ల వ్యయంతో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ జరగ్గా.. కొన్ని పనులు మినహా మరో 70 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. కరోనా కారణంగా కొంత ఆలస్యమైందని, వాటిని కూడా త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లను తూతూమంత్రంగా కాకుండా పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా సకల హంగులతో నిర్మించి ఇస్తున్నారని అన్నారు. లిఫ్టు, బిల్డింగ్ నిర్వహణ కోసం ఇక్కడ 19 దుకాణాలను ఏర్పాటు చేశామన్నారు. శనివారం ప్రారంభించిన ఈ సైట్ హైదరాబాద్ మహానగరంలో ఇరవై రెండవది అన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్.. వీటి పరిరక్షణ బాధ్యతను పిల్లిగుడిసెల డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు తీసుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పిల్లిగుడిసెల్లో నిర్మించిన 288 డబుల్ బెడ్రూం గృహాల్లో గతంలో ఇక్కడే నివాసం ఉన్న 141 మంది లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఇండ్లు కేటాయించామన్నారు. ‘ఒక్క పైసా ఇచ్చే అవసరం లేదు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఫ్లాట్ ఇప్పిస్తామని పైరవీలు చేస్తే నమ్మి పైసలు ఇవ్వొద్దు.. ప్రభుత్వం దగ్గర ఉన్న పేదల జాబితా ప్రకారమే లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయిస్తాం.’ అని మంత్రి సూచించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తుండగా, ఇందులో ఒక పార్టీ ఏకంగా 50 ఏండ్లు, మరో పార్టీ 20 సంవత్సరాలు పాలిస్తే హైదరాబాద్లో కేవలం మూడు దవాఖానలు మాత్రమే ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఒక విజన్.. వినూత్న ఆలోచనతో హైదరాబాద్ నలుదిశలా ఒక్కో మల్టీ స్పెషాలిటీ వైద్యశాలను నిర్మించాలని నిర్ణయించారని అన్నారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలో ఇప్పటికే టిమ్స్ను ప్రారంభించామని తెలిపారు. అల్వాల్, గడ్డి అన్నారం, చెస్ట్ దవాఖానలో నూతన వైద్యశాలలకు శంకుస్థాపన చేసి సంవత్సరం లోపు నగరవాసులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
పాతబస్తీలో 34 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చంచల్గూడ జైలును తరలించే విషయాన్ని హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళతానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వరంగల్ నడిబొడ్డున ఉన్న జైలును శివారు ప్రాంతాలకు తరలించి అక్కడే అత్యాధునిక హంగులతో ప్రభుత్వ దవాఖాన ఏర్పాటు చేసినట్లే.. చంచల్గూడ జైలును తరలించి ఐటీ పార్క్, డబుల్ ఇండ్లు, దవాఖాన వంటి బహుళ ప్రయోజనాలు కలిగే నిర్మాణాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఉస్మానియా వైద్యశాల స్థలంలో అధునాతన దవాఖాన నిర్మాణాన్ని చేపట్టాలన్న ఎంపీ అసదుద్దీన్ విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు.
హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తొస్తుంది.. పాతనగరంలో ప్రత్యేకమైన అభివృద్ధి పనులు జరగాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎన్నోసార్లు సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించారని మంత్రి కేటీఆర్ అన్నారు. పాతబస్తీలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వారం రోజుల క్రితం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో సుదీర్ఘంగా జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సంతోష్నగర్ నుంచి నల్లగొండ చౌరస్తా వరకు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు, ఫరూఖ్నగర్, జంగమ్మెట్, బండ్లగూడలో నిర్మితమవుతున్న డబుల్ బెడ్రూం ఇండ్లను డిసెంబర్ కల్లా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పజెప్పాలని నిర్ణయించామన్నారు. ఇదే తరహాలో రహదారుల విస్తరణ, డబుల్బెడ్రూంల ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
కనీస సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి వెళ్లదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆసరా పింఛన్లు గతంలో రూ.200 ఉంటే ఇప్పుడు రూ.2,106, వికలాంగులకు రూ.500 ఉంటే రూ.3,016 పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. గతంలో ఐదు కిలోల చొప్పున కుటుంబం మొత్తం గరిష్ఠంగా 20 కిలోల బియ్యం ఇచ్చే నిబంధన ఉంటే దానిని తీసేసి.. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామన్నారు. బడిలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులు చదువుకునేందుకు దాదాపు 1,000 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి రూ.1.25 లక్షలు వెచ్చించి బ్రహ్మాండంగా నాణ్యమైన చదువు చెప్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. దేశవ్యాప్తంగా గురుకుల పాఠశాలల విద్యార్థులు రాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, సీఈ సురేశ్, ఎమ్మెల్సీ జాఫ్రీ, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
సైదాబాద్/చాదర్ఘాట్/మాదన్నపేట్, ఆగస్టు 28: సోదర భావానికి ప్రతీక హైదరాబాద్ నగరమని.. నిజాం పాలనలో కొనసాగిన మతసామరస్యం ప్రస్తుతం సీఎం కేసీఆర్ పాలనలోనూ కొనసాగుతున్నదని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం పిల్లిగుడిసెల డబుల్ బెడ్ రూం గృహాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ ఒవైసీ మాట్లాడారు. పాతనగరం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ను కోరారు. జంగమ్మెట్, ఫరూఖ్నగర్, బండ్లగూడలో డబుల్ బెడ్ రూం ఇండ్లను త్వరలో పూర్తి చేయాలని మంత్రికి విన్నవించారు. రహదారుల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సంతోష్నగర్ నుంచి నల్లగొండ చౌరస్తా వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. మిగిలిన చోట్ల అభివృద్ధి పనుల డీపీఆర్లను పరిశీలించి ఆమోదించాలన్నారు. ఎమ్మెల్యే అహ్మద్ బలాల మాట్లాడుతూ మలక్పేట నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. పిల్లిగుడిసెల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఈ పరిసర ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని.. ఇది మలక్పేట నియోజకవర్గానికి ఐకాన్గా మారిందన్నారు. కార్యక్రమంలో మలక్పేట నియోజకవర్గం ఇన్చార్జి ఆజం అలీ, యాకుత్పురా ఇన్చార్జి సామ సుందర్రెడ్డి, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సీహెచ్.రాధ, వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, సామ స్వప్నారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్పర్సన్ సాయ భువనేశ్వరి, సైదాబాద్, ఐఎస్సదన్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కావేటి ధర్మరాజ్, నాయకులు మన్నె శ్రీరంగే, రాజు, సునీత్ పత్తి, కారింగల మారుతి పాల్గొన్నారు.
పటిష్టమైన పోలీసింగ్ వ్యవస్థ కోసం సీఎం కేసీఆర్ వందల కోట్ల రూపాయలు విడుదల చేశారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. డయల్ 100కు ఫోన్ చేస్తే తక్షణమే స్పందించే వ్యవస్థను రూపొందించినట్లు పేర్కొన్నారు. మహిళల భద్రతకు షీ టీంలు, అత్యాధునిక పెట్రోలింగ్ వాహనాలు సమకూర్చి హైదరాబాద్ను సేఫ్సిటీగా మార్చారన్నారు.
సైదాబాద్/చాదర్ఘాట్/మాదన్నపేట, ఆగస్టు 28: ప్రతిష్టాత్మకంగా చంచల్గూడ జైల్ సమీపంలో నూతనంగా నిర్మించిన పిల్లిగుడిసెల డబుల్ బెడ్ రూం గృహాలను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. దాదాపు 1.4 ఎకరాల విస్తీర్ణంలో ఏ,బీ,సీ బ్లాక్లుగా రూ.29.41 కోట్ల వ్యయంతో జీ+9 అంతస్థుల్లో 288 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. లాటరీ పద్ధతిన ఎంపిక చేసి 141 మంది లబ్ధిదారులకు ఇండ్లను అందజేశారు. దీంతో వారు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి గృహప్రవేశాలు చేశారు. అంతకు ముందు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే బలాల ఈ ఇండ్లను పరిశీలించారు. అక్కడి వసతులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ఇండ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారుల కు కాలనీవాసులు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు.
గుడిసెల్లో ఉన్న మాకు రెండు పడకల గదుల ఇండ్లు వస్తాయని ఎన్నడూ ఊహించలేదు. సీఎం కేసీఆర్ మాపై దయ ఉంచి ఇండ్లను కట్టి ఇచ్చిండు. లక్షల రూపాయలు విలువ జేసే ఇండ్లను ఉచితంగా ఇవ్వడం ఆనందంగా ఉంది. -బి.గోపమ్మ
ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినం. కానీ సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు ఎవరూ లేరు. ఇచ్చిన మాటకు కట్టుబడి చూడముచ్చటైన ఇండ్లను కట్టి ఇచ్చిండు. సారు చేసిన ఈ సాయాన్ని ఎన్నటికీ మరిచిపోలేం. సార్ సల్లంగుండాలి. మా లాంటి పేదల కష్టాలను తీర్చాలి. -టి. అంజమ్మ
ఇరుకైన స్థలాలు.. పురిగుడిసెల్లో నివాసం ఉండెటోళ్లం. సీఎం కేసీఆర్ పుణ్యమా మేడలాంటి ఇండ్లు వచ్చినయ్. ఎంతో సంతోషంగా గృహప్రవేశాలు చేసుకున్నాం. సార్కు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం. – సీహెచ్. రేణుక
ఒకప్పుడు గుడిసెల్లో ఉండెటోళ్లం. ఇంత మంచి ఇండ్లు కట్టిస్తరని అనుకోలే. అపార్ట్మెంట్లో లిఫ్ట్తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. మాకు ఇల్లు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. -అమీనా బేగం