సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): తస్మాత్ జాగ్రత్త.. ఎనీడెస్క్ యాప్ను డౌన్లోడ్ చేయిస్తున్న సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. కరెంట్ బిల్లు కట్టలేదని ఓ వ్యక్తికి వాట్సాప్ మెసేజ్ పంపిన నేరగాళ్లు.. ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేయించారు. అతడి ఖాతాల నుంచి రూ.8.10 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్కు చెందిన బాధితుడు ఇటీవల అమెరికాకు వెళ్లాడు.
కరెంట్ బిల్లు కట్టలేదంటూ అతడి ఫోన్కు మేసేజ్ వెళ్లింది. వెంటనే అతడు వాట్సాప్ మెసేజ్లో వచ్చిన నంబర్కు కాల్ చేసి, మాట్లాడాడు. నేను అమెరికాలో ఉంటున్నాను..అని చెప్పాడు. అక్కడి నుంచి కూడా బిల్లు చెల్లించవచ్చు.. అని చెప్పిన సైబర్ నేరగాళ్లు.. ముందుగా మీరు ఎనీడెస్క్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచించారు. ఆ తర్వాత ఒక లింక్ను పంపించి, ఆ లింక్ క్లిక్ చేసి రూ.11 చెల్లించాలని, ఆ తర్వాత మీ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు.
నేరగాళ్లు సూచించిన విధంగానే బాధితుడు చేశాడు. బాధితుడు తొలుత ఒక కార్డు సహాయంతో రూ.11 పంపించేందుకు ప్రయత్నంచగా.. ఆ కార్డు పనిచేయలేదు. దీంతో మరో కార్డును ఉపయోగించి చెల్లించాడు. అంతే.. ఎనీడెస్క్ యాప్ సహాయంతో ఆ రెండు కార్డులకు సంబంధించిన పిన్ను గుర్తించిన సైబర్నేరగాళ్లు.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే బాధితుడి రెండు ఖాతాల నుంచి రూ.8.18 లక్షలు కాజేశారు. బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుపై సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి బిల్లుల చెల్లింపైనా.. సంబంధిత శాఖలకు నేరుగా చెల్లించాలని పోలీసులు సూచిస్తున్నారు.