నేషనల్ మెన్స్ రైట్స్ సదస్సులో గృహ హింస కేసుల బాధితులు
సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమావేశం
సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): “హక్కులు మాకూ ఉన్నాయి. కావాలని మూర్ఖత్వంతో వేధించకండి.. కనికరం చూపండి.. మెరుగైన సమాజం కోసం పిల్లలను తీర్చిదిద్దాల్సిన సమయం.. శాడిస్టులుగా మారి దుర్భరమైన జీవితాలను అనుభవించాల్సిన అవసరం ఏమున్నది.. అని సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ (సిఫ్) ఆధ్వర్యంలో రెండో రోజు ఆదివారం నిర్వహించిన సదస్సులో సభ్యులు ప్రశ్నించారు.
పిల్లలపై తల్లిదండ్రులిరువురికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు ఉండేటట్లు చట్టాలు రావాలని నినదించారు. మహిళలతో పాటు పురుషులు కూడా లింగ వివక్షత లేకుండా చట్టాలను ఉపయోగించుకొనేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 498ఎ, 304బి, 376, 354, ఐపీసీ 125, డీవీసీ యాక్ట్ లాంటి చట్టాలను అడ్డుపెట్టుకొని కొందరు మహిళలు అమాయకులైన పురుషులను వేధింపులకు గురిచేయడం తగదని పేర్కొన్నారు. సమాజంలో కుటుంబ ప్రశాంతతని పెంపొందించడమే ధ్యేయంగా తాము కృషి చేస్తున్నామే తప్ప.. తమకెలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. కొన్ని కేసుల్లో మెయింటెనెన్స్ ఇస్తున్నా.. తిరిగి వేధిస్తున్నారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తమ ఆవేదనని పంచుకున్నారు.
సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల ‘నేషనల్ మెన్స్ రైట్స్ సదస్సు’లో పలువురు కౌన్సెలర్లు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కార్యక్రమంలో సంస్థ కన్వీనర్ అనిల్మూర్తితో పాటు కోఆర్డినేటర్లు జైదత్ శర్మ, ఆనందర్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి: సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భార్యా బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు బాలాజీరెడ్డి మాట్లాడారు. 498(ఏ) గృహహింస కేసు పెట్టిన ఏడాది తర్వాత కేసు తేలినా.! తేలకపోయినా.! కోర్టు విడాకులు మంజూరు చేసి రెండో వివాహానికి అనుమతి ఇవ్వాలన్నారు.
మంచివాడి మనసు కాలితే
నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివి.. ఖరగ్పూర్ ఐఐటీలో ఉన్నత చదువు పూర్తి చేశాను. గొప్ప ఉద్యోగం చేస్తూ.. మంచి జీతం తీసుకుంటున్నాను. నాకు ఎలాంటి వ్యాపకాలు లేవు. పెండ్లి అయినప్పటి నుంచి మొదలు ఈగోతో మాట్లాడుతుంది. నా తల్లిదండ్రులను గౌరవించదు. తోడబుట్టిన వారిని గౌరవించదు. అయినా సర్దుకుపోదామని ఆలోచించాను. పెండ్లికి ముందే వేరే వ్యక్తిని ప్రేమించానని, తనకు ఇష్టం లేకున్నా పెండ్లి చేశారని చెప్పింది. మరి నన్నెందుకు చేసుకున్నావని అడిగితే.. అడ్జస్ట్ అవుతానేమో ననుకున్నాను.. అంటుంది. ఇప్పుడు విడాకులు కావాలని డిమాండ్ చేస్తున్నది. మంచి వాడి మనుసు కాలితే.. చెడ్డవారి ఇల్లు కాలదా.. ఆమె పరిస్థితి అదే అయ్యింది. అనుకోకుండా ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. సంసారం చక్కదిద్దుకుందామంటే.. కోర్డులో కేసువేసి వేధిస్తున్నది.
– కోటేశ్వర్రావు ,సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఖమ్మం
చేతులు కట్టేసి కొట్టారు
2012లో మ్యారేజ్ అయ్యింది. అప్పటి నుంచి గొడవలే. నగరంలో పేరుగాంచిన దవాఖానల్లో వైద్యుడిగా పనిచేసేవాడిని. గొడవల వల్ల ఉద్యోగం పోయింది. పిల్లలను తీసుకొని తల్లిగారింటికి వెళ్లింది. ఎంత బతిమాలినా రాలేదు. భరణం ఇవ్వాలని కోర్టులో కేసు వేసింది. 2018 నుంచి ప్రతినెలా రూ.10వేలు చెల్లిస్తున్నాను. నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. పిల్లల్ని దూరం పెట్టడంతో వారు బాధపడుతున్నారు. నాకంటూ వ్యక్తిగత జీవితం లేకపోతే భవిష్యత్తులో నాతోపాటు నా తల్లిదండ్రుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సహజీవనంలో ఉన్నాను. ఏప్రిల్ 11న నా చేతులు కట్టేసి గంట పాటు మా అత్త, మామలతో పాటు వారి బంధువులు విపరీతంగా కొట్టారు. ఆ గాయాలు ఇప్పటికీ మానలేదు. నన్ను కొట్టే హక్కు వారికి ఎక్కడిది.? ఈ పరిస్థితుల్లో చావడమే శరణ్యమనిపిస్తున్నది.
– డాక్టర్ భానుప్రకాశ్, అల్వాల్
మేమేమైనా యంత్రాలమా..
మగవారిని ఎల్లప్పుడూ రెండో తరగతి పౌరులుగానే పరిగణిస్తున్నారు. ఎప్పుడూ.. డబ్బు కోసం ఈజీగా దొరికిన యంత్రంలా ఊహించుకుంటున్నారు. ఇలా అయితే.. భవిష్యత్తులో పెండ్లంటేనే యువకులు భయపడే రోజులు దాపురించే ప్రమాదం ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఎన్ఆర్ఐల పరిస్థితి దారుణంగా తయారైంది.
– వినయ్, సిఫ్ సభ్యుడు