చాదర్ఘాట్, జనవరి 6 : మలక్పేట కేర్ దవాఖాన వైద్యులు స్పృహలో ఉన్న రోగికి మెదడులోని కణితిని(ట్యూమర్) విజయవంతంగా తొలగించి అరుదైన ఆపరేషన్ చేశారు. వైద్య రంగంలో మేజర్ శస్త్ర చికిత్సను స్పృహలో ఉన్న రోగికి సుమారు ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మెదడులోని ఇతర భాగాలకు ఎటువంటి ప్రమాదం జరుగకుండా ట్యూమర్ను తొలగించారు. ఇందుకు సంబంధించి దవాఖాన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కృష్ణమూర్తి, న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ కేవీ.శివానంద్రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్కు చెందిన గిరిధర్(40) కొద్ది రోజులుగా మూర్చ వ్యాధితో బాధపడుతుండడంతో కేర్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. వైద్య పరీక్షలు నిర్వహించి మెసియల్ టెంపోరల్ స్లెరోసిస్తో బాధపడుతున్నట్లు గుర్తించారు.
శస్త్ర చికిత్స చేసి ట్యూమర్ను తొలగించాలని వైద్యులు నిర్ధారణ చేశారు. సాధారణ సర్జరీ చేస్తే రోగి ప్రాణాలు పోయే ప్రమాదముందని భావించి.. న్యూరో సర్జరీ, అనస్తీషియా వైద్యులు కలిసి అమిగ్డలోహిప్పో కాంపెక్టమీ అవేక్ క్రేనిటోమి సర్జరీ చేయాలని నిర్ణయించారు. సుమారు ఆరు గంటల పాటు శ్రమించి ట్యూమర్ను తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స తరువాత 4వ రోజు రోగిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. కేర్ ఆసుపత్రి మలక్పేటలో తొలిసారిగా చేపట్టిన ఈ మేజర్ సర్జరీ విజయవంతం కావడంతో వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. సర్జరీలో భాగస్వాములైన వైద్యులను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కృష్ణమూర్తి అభినందించారు.