సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): థర్డ్వేవ్ను దృష్టిలో పెట్టుకుని నిలోఫర్లో చేపడుతున్న ఏర్పాట్లను వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేష్రెడ్డి పరిశీలించారు. మంగళవారం నిలోఫర్ దవాఖానకు చేరుకున్న ఆయన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ ఉషారాణి, కొవిడ్ నోడల్ అధికారి, ఆర్ఎంఓ డాక్టర్ రమేష్ దాంపురి, ఆర్ఎంఓ డాక్టర్ లల్లూప్రసాద్ రాథోడ్లతో కలిసి నిలోఫర్ పాత భవనంతో పాటు ఇన్ఫోసిస్బ్లాక్లను సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న వెయ్యి పడకల కరోనా బ్లాక్కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇన్ఫోసిస్ బ్లాక్లో సత్వరం ఏర్పాటు చేస్తున్న 150 ఆక్సిజన్ పడకలు, వెంటిలెటర్ల ఏర్పాట్ల వివరాలను సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పిల్లలపై కరోనా ప్రభావం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిలోఫర్ వైద్యాధికారులకు సూచించారు.