బన్సీలాల్పేట్, ఏప్రిల్ 10 : కరోనా ఉధృతిని ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉన్నామని డీఎంఈ డాక్టర్ కె.రమేశ్రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు సోమవారం ఆయన గాంధీ దవాఖానలో అదనపు డీఎంఈ, సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, ఆర్ఎంఓలతో కలిసి ‘కొవిడ్ మాక్ డ్రిల్’ నిర్వహించారు. గాంధీ దవాఖానలో లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను, ఐసీయూలను, ట్రై యాజ్, క్యాజువాలిటి వార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గాంధీ దవాఖానలో 650 ఐసీయూ బెడ్లు, 650 ఆక్సిజన్ బెడ్లు, 650 జనరల్ వార్డులలో బెడ్లు, క్యాజువాలిటి, ట్రై యాజ్లలో కలిపి మొత్తం రెండు వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. రోగులకు అందించడానికి నిమిషానికి 7 వేల లీటర్ల ఆక్సిజన్, 46 వేల కిలోల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వెంటిలేటర్లు, మల్టీచానల్ మానిటర్లు, సీపాప్, బీపాప్ యంత్రాలు, మాస్క్లు, పీపీఈ కిట్లు తదితర పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఒకేసారి ఐదు వేల మంది కొవిడ్ బాధితులు వచ్చినా వైద్యసేవలు అందించడానికి డాక్టర్లు, సిబ్బంది, సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.
వైరస్ ప్రజల్లోనే తిరుగుతున్నది.. జాగ్రతలు తప్పనిసరి
వైరస్ విభిన్నమైన రూపాంతరాలు చెందుతూ ప్రజల్లో తిరుగుతున్నదని, ప్రజలు కనీస జాగ్రతలు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్ ఎం.రాజారావు అన్నారు. మన వద్ద కనిపించే వైరస్ బలహీనంగా ఉన్నప్పటికి దానిని తక్కువ ఆంచనా వేయవద్దని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. కనీస దూరం పాటించాలని, మాస్క్లను ధరించాలని, తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వయోవృద్ధులు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. గాంధీ దవాఖానకు ఎక్కువగా బయటి నుంచి కొవిడ్ కేసులు వస్తున్నారని తెలిపారు. తమ వద్దకు వచ్చిన కొవిడ్ బాధితుల వైరస్ను జీనోమ్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.